మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాల నడుమ వచ్చిన 'సైరా' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనంతో మొదలైనా.. చివరికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోతున్నాడు. ఒక పక్క హిస్టారికల్ హిట్.. ఎమోషనల్ ట్రీట్ అంటూ కీర్తించబడుతున్నా.. ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులంతా 'సైరా' అద్భుతమైన సినిమా.. హృదయాన్ని కరిగించిన సినిమా.. గొప్ప దేశభక్తిని చాటిన సినిమా అని విశేషంగా పొగుడుతున్నా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద 'సైరా' నీరసించి పోయి టాక్ కు తగ్గట్టు కలెక్షన్స్ ను రాబట్టలేక చతికలపడ్డాడు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల షేర్ మార్క్ ను దాటింది. కానీ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా ఉండటంతో.. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకాస్త బెటర్ కలెక్షన్స్ వస్తేనే బయ్యర్లు సేఫ్ పొజిషన్ లోకి వెళ్తారు. కానీ కొత్త సినిమాలు విడుదలకావడంతో థియేటర్ల సంఖ్య తగ్గించారు. పైగా సెలవులు కూడా ఏమీ లేవు. కాబట్టి వసూళ్లు తగ్గుముఖం పడతాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక యూఎస్ లో ఈ చిత్రం 2.6 మిలియన్ల మార్క్ ను దాటింది. అయితే ఇతర భాషల్లో సైరా కలెక్షన్స్ దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో నైజాం మరియు వైజాగ్ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏమైనా సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోవడానికి కారణం సినిమా ఓవర్ బడ్జెట్ అవ్వడమే కారణం అని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మిగిలిన భాషల్లో మార్కెట్ ఏర్పర్చుకోవడానికి చిన్న చిన్న పాత్రలకు కూడా ఇతర సినీ ఇండస్ట్రీల స్టార్స్ ను పెట్టుకున్నారు. మొత్తానికి సైరాకి వచ్చిన 50 కోట్లు వరకూ లాస్ కి కారణం ఓవర్ బడ్జెట్ మరియు అనవసరపు స్టార్ కాస్టింగే. సూపర్ హిట్ టాక్ సాధించినప్పటికీ 'సైరా', బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోవడానికి మరో కారణం.. సైరా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో.. ప్రధానంగా పిల్లలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. పాపం మెగాస్టార్ ఇది ఉహించి ఉండరు. ఇక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించగా నయనతార కథానాయికగా నటించింది.