మెగాస్టార్ సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. మరో కొన్ని రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నది. దానికంటే ముందు ఈనెల 15 వ తేదీ నుంచి ప్రమోషన్ హడావుడి మొదలుకాబోతున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై నమ్మకం పెంచింది. చారిత్రాత్మక కథతో తెరకెక్కిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆ అంచనాలతోనే సినిమా బిజినెస్ కూడా జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అనుకున్న దానికంటే డబుల్ జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటె, ఈ సినిమాకు డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫిగా పనిచేసిన రత్నవేలు ఈ సినిమా విషయంలో కొన్ని సందర్భాల్లో అసంతృప్తితో ఉన్నాడట. సెట్స్ లో కోపంతో ఉన్నాడని కొంతమంది ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని రత్నవేలు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇలా కోపంగా ఉండటానికి కారణం ఉన్నది. అదేమంటే...
రత్నవేలు గతంలో శంకర్ రోబో, బాహుబలి, బాహుబలి 2, సుకుమార్ సినిమాలకు పనిచేశారు. రత్నవేలు దర్శకుడు శంకర్ స్టైల్ కు బాగా అలవాటు పడిపోయాడు. శంకర్ 20 రోజులపాటు షూటింగ్ చేస్తే.. పది రోజులపాటు గ్యాప్ ఇస్తాడు. ఈ పదిరోజులు రెస్ట్ తీసుకొవడమో లేదంటే సీన్స్ గురించి డిస్కస్ చేయడమో చేస్తుంటారు. సినిమా బాగా రావడానికి ఈ గ్యాప్ బాగా ఉపయోగపడుతుంది.
కానీ, సైరా సినిమా విషయంలో దానికి విరుద్ధంగా జరిగింది. సైరా కొన్నిసార్లు గ్యాప్ లేకుండా సినిమాను షూట్ చేయాల్సి వచ్చిందట. అలా గ్యాప్ లేకుండా వరసగా నెలల తరబడి షూటింగ్ చేయాల్సి రావడంతో రత్నవేలు కొన్నిసార్లు సెట్స్ లో కోపంతో అరిచేసేవారని, కొన్ని సందర్భాల్లో అలా చేయడం తప్పలేదని అన్నారు రత్నవేలు. అయితే సినిమా షూటింగ్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా రాజీపడలేదని అన్నారు.