ఇటీవల కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్న పోలీసులు మరోసారి తమ పంజా విసిరారు. చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దుల్లో చెలరేగిపోయారు. కూంబింగ్ లో ఎదురైన నక్సల్స్ , పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 12 మంది నక్సల్స్ మరణించినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద ఎన్ కౌంటర్ కావడం విశేషం.
ఈ ఎదురు కాల్పుల్లో పోలీసులకూ ప్రాణ నష్టం కలిగింది. సుశీల్ అనే ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట- ఛత్తీస్గఢ్లోని పూజారికాంకేడు సరిహద్దుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఎదురుకాల్పుల ఘటనలో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హరిభూషణ్ ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ స్థలంలో తుపాకులు, స్కానర్, ల్యాప్ట్యాప్, రూ.41వేల నగదు దొరికాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు గ్రేహౌండ్స్ దళాలు ఈ ప్రాంతంలో రెండ్రోజులుగా కూంబింగ్ చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో భారీ స్థాయిలో నక్సల్స్ ప్రాణాలు కోల్పోవడంతో ముందు ముందు ఏం జరుగుతుందనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.