ఇంటర్ విద్యార్థుల ఫలితాల గందరగోళంలో అన్ని వేళ్లు గ్లోబరీనా టెక్నాలజీస్ వైపే చూపుతున్నాయి. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు ఈ సంస్థను తప్పుపడుతుండగా...తాజాగా నిపుణులు కమిటీ సైతం ఇదే మాట చెప్పింది. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సైతం ఆ సంస్థ పైనే నిందారోపణలు చేశారు. సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో విద్యార్ధి జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు , కొందరు విద్యార్ధి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సైతం గ్లోబరీనాపై మండిపడ్డారు.
గ్లోబరినా సంస్థ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది పిల్లలు డబుల్ ఫీజులు కట్టారని ఈ విషయంలో ముందు నుంచి ప్రభుత్వాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ లు హెచ్చరించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని కోదండరాం అన్నారు. గ్లోబరినా ప్రయోజనాల కోసం ప్రభుత్వ విద్యార్థుల జీవితాలను పొట్టన పెట్టుకుందన్నారు. వారు చేసిన తప్పిదాల వలన 9 లక్షల మంది జీవితాలు నాశనం అయ్యాయన్నారు. బోర్డులో జరిగిన అవకతవకలపై, ఈ నెల 29వ తేదీన ఇంటర్ బోర్డ్ ముందు ధర్నా చేయబోతున్నామని… విద్యార్దుల భవిష్యత్తు కోసం ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని తల్లిదండ్రులకు, విద్యార్ధి సంఘాలకు కోదండరాం పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలులో ఉన్న ఆసక్తి… ప్రభుత్వానికి ఇంటర్ విద్యార్థుల మీద లేదని ఆయన ఆరోపించారు.
మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ..బ్లాక్ లిస్ట్ లో ఉన్న గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదం వల్లనే ఇంటర్ విద్యార్ధులకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని అన్నారు. 23 మంది విద్యార్ధుల ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. ఇంటర్ బోర్డు నిర్వాకంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధుల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు జరుగుతున్న పరిణామాలు అడ్డుకోకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు.