గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల సందర్భంగా రాజకీయాలు వేడెక్కి పోతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై సీఎం జగన్, ఇతర వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ మద్య వైసీపీలోకి ఇతర పార్టీ నేతలు జంప్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అత్యంత తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కన్నా భయంకరపై వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని అన్నారు.
కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడితే ఏం చేసిందో ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ తీరు కూడా అదే విధంగా ఉందని విమర్శించారు. భారత దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందరికీ తెలిసిందే.. అలాంటి వారిలో ఒక ఇద్దరు మాత్రం చనిపోయారు. అంటే ఏపిలో దాని ప్రభావం ఎంత ఉంటుందో తెలిసిందే. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. తన నిర్ణయం నేపథ్యంలో ఆర్టికల్ 243కె, ఆర్టికల్ 243జడ్ఏ లను ఉపయోగించాడు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు కానీ, మానవ కల్పిత విపత్తు వచ్చినప్పుడు కానీ ఈ ఆర్టికల్ ఉపయోగించి ఎన్నికలు వాయిదా వేయొచ్చు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఏ అధికారి అయినా దేశం కోసం పనిచేస్తారు. కానీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం చంద్రబాబు కోసమే పనిచేస్తారు. ఒక కులపిచ్చి ఉన్న వ్యక్తిలా వ్యవహరించి నిర్ణయం తీసుకున్నారు. రమేశ్ కుమార్ కు సిగ్గుంటే పదవికి రాజీనామా చేయాలి. తాను తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని నిరూపించుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపిలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. మునిగిపోతున్న టీడీపీ నావను రక్షించడానికే రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశారు అంటూ నిప్పులు చెరిగారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.