
సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరోమారు అలజడి నెలకొంది. ఎదురుకాల్పులు, బంద్లు, మందుపాతర పేలుళ్ల వంటి వరుస ఘటనలతో వాతావరణం వేడెక్కింది. దాదాపు పుష్కరకాలం తర్వాత మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకున్నాయి. రిక్రూట్మెంట్ల కోసం సరిహద్దు జిల్లాల్లో మూడు మావోయిస్టు బృందాలు రంగంలోకి దిగడం..ఉనికి చాటుకునేందుకు పోలీసులకు సవాలు విసురుతున్నారు. వారి ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు పోలీసు బలగాలు అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. ఏకంగా డీజీపీ రంగంలోకి దిగి క్షేత్రస్థాయి శ్రేణుల్ని సమాయత్తం చేయడం.. సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి.
ఈ రోజు నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోవాలంటూ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపు ఇవ్వడంతో తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో మూడు నెలల క్రితం వరకు పరిస్థితి ప్రశాంతంగానే కనిపించింది. ఆ తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి బస్వరాజ్ ఆదేశాలతో తెలంగాణలో పట్టు సాధించేందుకు రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఆసిఫాబాద్ అడవుల్లో, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ భూపాలపల్లి, ములుగు అడవుల్లో సంచరిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది.