ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం అయితే ఆ ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మరి అత్యంత ఆవశ్యకాలు. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వివరించినప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మీద ఆగ్రహాన్ని ప్రేమను వ్యక్తం చేసినప్పుడు ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతుకి ఉన్నది  అనిపించింది. కానీ ఎన్నికలు సమీపించిన తర్వాత కోట్లాది రూపాయలను అధికార పార్టీ ఖర్చు చేయడంతో పాటు ప్రజలకు డబ్బు పంపిణీ చేసి కొందరిని మరచి వివక్షతకు గురి చేస్తే మాకెందుకు ఇవ్వరని రోడ్డుపై ధర్నాలు  పికెటింగులు చేయడంతో అధికార పార్టీ దురుసుతనం , ప్రజాస్వామ్యం బలహీనత, ప్రజల దృష్టికి పాలకుల దృష్టికి ప్రపంచ దృష్టికి వచ్చినట్లు అయింది.

ఎన్నికలు సాఫీగా స్వేచ్ఛగా జరగాలి:
   ప్రజలే ఓటర్లుగా గల ఎన్నికలు గాని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేసి గెలిపించే శాసనమండలి సభ్యుల ఎన్నికలు గాని ,శాసనసభ్యులు లోక్సభ సభ్యులు ఓటు వేసి గెలిపించే శాసనమండలి రాజ్యసభ సభ్యుల ఎన్నికల వేళ  తమ ఎన్నిక కోసం సంబంధిత ఓటర్లను క్యాంపుల్లోకి తీసుకెళ్లి నెలల తరబడిగా పోషించి వారి స్వేచ్ఛను హరించి కోట్లాది రూపాయలను అక్రమంగా ఖర్చు చేసే దుర్నీతికి ముఖ్యంగా అధికార పార్టీలు పాల్పడడంపై ఎన్నికల సంఘం వెంటనే చర్య తీసుకొని క్యాంప్ నిర్వహించిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి. అప్పుడు గానీ రాజకీయ నాయకులకు అధికార పార్టీ లకు సోయి రాదు.
 క్యాంపు రాజకీయాలు జుగుప్సాకరం:
   కరీంనగర్ నుండి స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకోబడే శాసనమండలి సభ్యుల ఎన్నిక కోసం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారిని తెరాస పార్టీ, సంబంధిత మంత్రి ,రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని గెలుపే ధ్యేయంగా వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ గత 20 రోజులకు పైగా క్యాంపులో నిర్బంధించడం చట్టరీత్యా నేరమే. తెరాస పార్టీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలవచ్చు. కానీ ఎన్నికల సమయంలో వారి అభిప్రాయం మేరకే ఓటు వేయడం అనేది సర్వత్రా జరుగుతూ ఉంటుంది. అలాంటి స్వేచ్ఛను హరించి వేసే అధికారం ఏ పార్టీకి గాని ప్రభుత్వానికి ముఖ్యంగా అధికార పార్టీకి లేదు. అందులో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు ముఖ్యంగా తమ విధి నిర్వహణకు ప్రజాసేవకు దూరమై ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇలాంటి క్యాంపు రాజకీయాలు నిర్వహించాలంటే ఒక వైపు ఎన్నికల సంఘం తో పాటు మరొక వైపు ఎన్నుకున్న  ఓటర్లు ప్రశ్నిస్తే తప్ప ఆ స్థానిక సంస్థల ప్రతినిధులు క్యాంపు రాజకీయాలకు వెళ్లరు. కంచె చేను మేసినట్లుగా ప్రజలకు సేవ చేయవలసిన ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులను బలవంతంగా క్యాంపులోకి తీసుకెళ్తే ప్రభుత్వం ద్రోహం చేసినట్లు కాదా..?


విధి నిర్వహణ నుండి తప్పించడం ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను విస్మరించడమే అని ఇప్పటికైనా క్యాంపు రాజకీయాలు నిర్వహించే వారు గుర్తించాలి. కళ్ళు  చెవులు ఉండి ప్రత్యక్షంగా ఇలాంటి పాలకుల దుర్మార్గాలను చూస్తున్నటువంటి ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదు..? హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం అధికార పార్టీ డబ్బులు ఇవ్వలేదని ధర్నాలు చేసినా కూడా ఆనాడు పట్టించుకోని ఎన్నికల సంఘం ఈనాడు క్యాంపు రాజకీయాలను కూడా పట్టించుకోకపోవడం కావాలని చేస్తున్న పని అని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విమర్శకులు ఎన్నికల సంఘం పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే వారి ప్రజాప్రతినిధులు క్యాంపుల్లో తాగి ,తింటూ, తందనాలు ఆడుతూ ప్రజలను మర్చి పోవడం నిజంగా అవివేకమే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: