
ముఖ్యంగా చైనాతో ఆయన మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం గురించి ప్రపంచానికి తెలిసిందే. డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతులపై వంద శాతానికి పైగా సుంకాలు విధించి ట్రంప్ సంచలనం సృష్టించారు. దీనికి చైనా కూడా ఏమాత్రం తగ్గకుండా గట్టిగా బదులిచ్చింది. అమెరికా ఉత్పత్తులపై పన్నులు పెంచడమే కాకుండా, తమ కరెన్సీ విలువను తగ్గించుకోవడం, కొన్ని కీలకమైన అమెరికా కంపెనీలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలతో ట్రంప్కి సవాలు విసిరింది.
ఈ వార్తో మార్కెట్లు దెబ్బతినడంతో, ట్రంప్ కొంత వెనక్కి తగ్గి, ఇతర దేశాలపై పన్నులను తాత్కాలికంగా తగ్గించినా, చైనాపై మాత్రం తన పట్టు వీడలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలైన కంబోడియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం నుంచి వచ్చే సోలార్ ప్యానెల్స్పై ఊహించని స్థాయిలో పన్ను విధించారు.
ఎంతో అనుకుంటున్నారు ఆ పన్ను రేటు ఏకంగా 3521 శాతం. వింటేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇది 352 కాదు, ఏకంగా మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క శాతం. దీనితో అక్కడ తక్కువ ధరకు దొరికే సోలార్ ప్యానెల్స్ అమెరికాకు వెళ్లేసరికి వాటి ధర ఆకాశాన్ని అంటుతుంది. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ వర్గం చెబుతోంది.
ఈ భారీ సుంకాలతో దెబ్బ తిన్న ఆగ్నేయాసియా దేశాలకు ప్రత్యామ్నాయంగా, భారత్ వంటి దేశాలకు ఇది లాభదాయకంగా మారే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా మార్కెట్ లోకి సోలార్ ప్యానెల్స్ ఎగుమతి చేసే ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చని అంచనా.
మొత్తానికి, 'అమెరికా ప్రయోజనాలే ముఖ్యం' అంటూ ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి కఠిన నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు ఇంకా కమ్ముకునే ఉన్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.