రాజకీయాల్లో ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద మూల్యం చెల్లింపజేయగలదని మరోసారి రుజువవుతోంది. అనుకోకుండా జరిగినా, కావాలని చేసినా ఆ తప్పులు భవిష్యత్తులో పదవుల రూపంలో, గుర్తింపు రూపంలో తిప్పలే తెస్తాయి. టిడిపిలో ఇలాంటి పరిస్థితులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా ఎవరినీ శిక్షించకపోయినా వారి తోక‌లు ఎలా క‌ట్ చేయాలో అలా చేసేస్తారు. 2014-19 మధ్య కాలంలో వైసీపీ నుంచి టిడిపిలో చేరిన మైనారిటీ ఎమ్మెల్యేకు మైనార్టీ సంక్షేమ శాఖ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు వద్ద ఉందని అప్పట్లో చర్చ జరిగింది. అలాగే గిరిజన వర్గానికి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేను కూడా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. అయితే వీరిద్దరూ మీడియా ముందు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసి వివాదాలకు దారితీసారు.


ఫలితంగా వారికి లభించాల్సిన పదవులు ఎక్కడో ఆగిపోయాయి. చివరికి పార్టీలోనూ పెద్ద గుర్తింపు లేకుండా పోయింది. దీన్నిబట్టి చంద్రబాబు దగ్గర మంచి మార్కులు సంపాదించుకోవడమే కాక, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమని తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే సీనియర్ నేత, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విషయంలోనూ చర్చకు వచ్చింది. ఉత్తరాంధ్రలో కాలింగ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అచ్చం నాయుడు మంత్రిగా ఉన్నా.. మరో స్థానిక నేతకు కూడా అవకాశమివ్వడం ద్వారా ఆ వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న‌ది బాబు స్కెచ్‌.


అయితే, తాజాగా రవికుమార్ ఓ టీచర్‌కు ఫోన్ చేసి బెదిరించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తాను బెదిరించలేదని, కేవలం ప్రశ్నించానని ఆయన చెప్పినా, ఆ టీచరు మాత్రం తనపై లైంగిక వేధింపులు జరిగాయంటూ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై వివాదం చెలరేగింది. ఈ పరిణామాల కారణంగా మంత్రివర్గ జాబితాలో రవికుమార్ పేరు డైల‌మాలో ప‌డింద‌న్న చర్చ పార్టీ వ‌ర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి, టిడిపిలో పదవి సాధించాలన్నా, చంద్రబాబు నమ్మకాన్ని పొందాలన్నా, వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేలింది. కేవలం కులం, సామాజిక వర్గం లేదా ఆర్థిక బలం సరిపోదు. వ్యక్తిగత ప్రవర్తన, ఆటిట్యూడ్, శాంతమైన వైఖరి కూడా చంద్రబాబు గమనిస్తారని నేతలు గుర్తించుకోవాలి. లేని పక్షంలో చిన్న పొరపాటే పెద్ద తిప్పలు తెచ్చిపెడుతుందని ప్రస్తుత పరిణామాలు మరోసారి చాటి చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: