రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ తిరగబడింది. తమ అభ్యర్థిని గెలిపించునే బలం లేదని తెలిసినా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తో నామినేషన్ దాఖలు చేయించింది. అయితే పార్టీ ఫిరాయింపుల విషయాన్ని చర్చనీయాంశంగా మార్చాలని చూసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్లు తయారైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ల శాసనసభ సభ్యత్వాలను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి రద్దు చేశారు.
వీరి శాసనసభ్యత్వాల రద్దుపై అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం.. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఓటేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ కోరడం.. ఓటేసే అవకాశం ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బతగిలింది. ఆరు వారాల పాటు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొంత ఊరటపొందిన కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేశారనీ.. వారు పార్టీ మారినప్పటికీ.. విప్ ను ధిక్కరించి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేశారనీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. అయితే తమ అభ్యర్థి ని బరిలోకి దింపి అధికార టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది.
ఇదిలా వుండగా.. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా ఓటు వేయవచ్చనీ..అయితే ఓటు వేసే ముందు ఆయా పార్టీ ల ఏజెంట్లకు చూపించాల్సి ఉంటుంలనీ పలువురు రాజ్యాంగ, ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీలు జారీ చేసే విప్ పనిచేయవని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని పలువురు నేతలు అంటున్నారు. ఇక టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికీ మద్దతు ఇవ్వకుండా ఎన్నికలకు దూరంగా ఉండటం గమనార్హం. ఇందులో ఆంతర్యం ఏమిటో రోజులు గడిచేకొద్దీ తెలిసే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.