అవును! ఇప్పుడు రాష్ట్రంలోని మేధావుల నుంచి సామాన్యుల వరకు కూడా ఇదే విషయంపై చర్చ నడుస్తోంది. తెలంగాణ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న జగన్.. మరి ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన హక్కులు, ఆస్తుల విషయంలో ఎలా వ్యవహరిస్తారు? రాజకీయంగా కీలక మలుపులో ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్తారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. సీఎం అయ్యూ అవడంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్తో చెలిమి చేసిన జగన్.. తెలంగాణకు అన్ని విధాలా సహకారం అందించేందుకు రెడీ అయ్యారు.
తొలి అడుగులోనే కేసీఆర్ మనసు దోచుకున్నారు జగన్. తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న ఏపీ ఆస్తులను ఆ ప్రభుత్వానికే ఉదారంగా అప్పగించేశారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. అయితే, అప్పట్లో చంద్రబాబు పంతానికి పోయి. కేసీఆర్కు ఆయా ఆస్తులను అప్పగించలేదు. కానీ, ఇప్పుడు జగన్ అధికార పగ్గాలు చేపట్టకముందుగానే ఆయా ఆస్తులను తెలంగాణ పరం చేసేశారు. ఇక, కేసీఆర్ కోరడంతో ఏపీలోని నౌకాతీరాల్లో తెలంగాణ ప్రభుత్వం వ్యాపారం చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చారు.
ఈ రెండు పరిణామాల విషయంలో ప్రజల్లో అసంతృప్తి లేక పోయినా.. ఏపీకి సంబంధించి తెలంగాణ నుంచి కూడా అనేక రూపాల్లో సాయం రాబట్టాలనేది వారి ప్రధాన డిమాండ్. మనం సహకరించడం సరే.. మన సమస్యలు కూడా పరిష్కరించుకోవాలిగా! అనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. ఆర్టీసీ ఆస్తులకు సంబంధించిన విషయం ఇప్పటికీ ముడిపడని విధంగానే ఉంది. దీనిపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక, సీమకు నీళ్లందించే విషయం కూడా ముందుకుసాగడం లేదు. కానీ, కేసీఆర్ తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జగన్తో జై కొట్టించుకున్నారు. మరి ఈ క్రమంలోనే ఏపీకి సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇలానే వ్యవహరించేలా జగన్ చక్రంతిప్పాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా కృష్ణానది నీటికి గండి కొట్టాలన్న కేసీఆర్ వ్యూహానికి అంతే మంచిగా ప్రతి వ్యూహం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్కరాష్ట్రాలతో చెలిమి చేయాల్సిన అవసరం ఎంత ఉందో.. సొంత రాష్ట్రానికి మేలు చేయాల్సిన అవసరం జగన్పై అంతే ఉంది. ఈ విషయాన్ని మరిచిపోతే.. మాత్రం ఇబ్బంది తప్పదని హెచ్చరిస్తున్నారు మేదావులు. మరి జగన్ వ్యూమం ఎలా ఉండబోతోందో చూడాలి.