ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే సంచలన నిర్ణయాలు తీసుకు న్నారు. ఎవరు తనకు ఆసరాగా ఉంటారో చూసుకుని వారికే జై కొట్టారు. `ఉపయోగించుకోవడం`- అనే రాజకీయాలకు ఆమె కేరాఫ్గా మారారు. ఆమే.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున విజయం సాధించిన
ఎన్నారై మహిళ, బీసీ వర్గానికి చెందిన విడదల రజనీ. నిజానికి గుంటూరు రాజకీయాల్లో ఆమె ఓ సంచలనం.
పట్టుమని రెండు నెలల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆమె సంచలన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్లను సైతం పక్కన పెట్టించి టికెట్ తెచ్చుకుని, విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చుక్కలు చూపిస్తానని బహిరంగ వేదికపై సవాల్ చేసి.. దానిని నిలబెట్టుకున్న లేడీ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదేసమయంలో స్థానిక రాజకీయాలపై పట్టు పెంచుకునేం దుకు వైసీపీలో తిరుగేలేని నాయకురాలిగా మారేందుకు కూడా ఆమె ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ రోజాను మించి పోవాలని కలలు కంటున్నారు విడదల. ఈ క్రమంలోనే ఎక్కడ మైకు పుచ్చుకున్నా.. తనకంటూ ప్రత్యేకత చూపించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని తప్పులు కూడా చేసేస్తున్నారు. అయితే, ఇవి రానురాను వివాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా ఈ నెల 2న మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలో అట్టహాసంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు విడదల రజనీ. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మహాత్మా గాంధీ జయంతిపై అనర్గళంగా ప్రసంగించి రికార్డు సృష్టించాలని అనుకున్నారు. కానీ, ఆదిలోనే హంసపాదులా తప్పుటగులు వేశారు.
బాపూ 150 జయంతి.. అంటూనే 70వ జన్మదినం అని వ్యాఖ్యానించి అభాసు పాలయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. కొందరు పడిపడి నవ్వుతుంటే.. మరికొందరు పళ్లు కొరుకుతున్నారు. అధికార పార్టీ ప్రతినిధిగా తన పేరు ముందుండాలని కోరుతున్న ఈమె ఇప్పుడు ఇలా తప్పుటడుగు వేయడం ఏంటి? గాంధీ జయంతి గురించి కూడా నాలుగు ముక్కలు మాట్లాడలేని దౌర్భాగ్య ఎమ్మెల్యే మాకు దాపురించిందని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ క్రమంలో మరి విడదల .. ఎప్పటికి జబర్దస్త్ రోజాను ఢీకొంటుందో చూడాలి.