ఒక ఊరిలో ఒక పాల వర్తకుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు పాలల్లో సగానికి సగం నీళ్లు కలిపి అమ్మేవాడు. ప్రజలకి అతని పాలు నచ్చేవి కావు. అయినా ఇంకెక్కడ దొరకకపోవడంతో తప్పనిసరై అతని వద్దే కొనేవారు.
ఒక రోజున అతనికి పాలు అమ్మితే ఒక వంద రూపాయల  నాణ్యాలు వచ్చాయి. వాటిని ఒక సంచిలో వేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి పోతున్నాడు. మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకొని వెళితే బాగుంటుంది కదా..! అని అనుకొని చెరువుగట్టు పైనున్న ఒక చెట్టు నీడలో తన నాణేల సంచిని తల కింద పెట్టుకుని పడుకున్నాడు. చల్లని గాలికి అతనికి హాయిగా నిద్ర పట్టింది.


ఇక కాసేపు అయిన తరువాత అతనికి ఏవో రూపాయి కాసులు పడ్డ చప్పుడు వినిపించింది. ఉలిక్కిపడి లేచి చూసాడు. తలకింద సంచి లేదు.పైకి చూస్తే  చెట్టుపైన ఒక కోతి వుంది. దాని చేతిలో ఇతని నాణేల సంచి  ఉంది.

ఆ కోతి ఒక్కొక్క రూపాయి ని తీసి కొరికినట్లు కొరికి కిందకు విసిరేస్తోంది. ఒక రూపాయి ని చెరువుల్లోనూ, ఒక రూపాయి ని గట్టుమీద పడేస్తోంది. చివరికి ఖాళీ సంచిని కూడా నేల మీదకు విసిరి కొట్టింది. ఆ పాల వాడు ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయాడు. మెల్లగా వెళ్లి గట్టుపై పడిన నాణేలను ఏరుకొని సంచిలో వేసుకొని గబగబ ఇంటికి చేరుకున్నాడు. అలా తీసుకొచ్చిన సొమ్మును లెక్కపెడితే 50 నాణేలు  మాత్రమే ఉన్నాయి. అంటే తాను కలిపిన సగం నీళ్ల ధర నీళ్లలోకి పోయింది. పాల ధర మాత్రమే చేతికి వచ్చింది.

కాబట్టి ఏ విషయంలోనైనా సరే నిజాయితీగా ఉన్నప్పుడే పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి.. అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నిజాయితీని కోల్పోతామో, మన పై ఉన్న ఇతరుల నమ్మకం కూడా కోల్పోయి , మనం ఎప్పటికీ తిరిగి వారి నమ్మకాన్ని పొందలేము.


మరింత సమాచారం తెలుసుకోండి: