సొంతగడ్డపై శ్రీలంక చాన్నాళ్లకు దుమ్ము దులిపింది. ఈ రకంగా లంక గత 30 ఏళ్ల చరిత్రను తిరగరాసిందనే చెప్పుకోవాలి. 1992 తర్వాత తొలిసారి ఆ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకొని లంక ప్రేక్షకుల గుండెల్లో చెరగని ఓ ముద్ర వేసింది. మొన్న మంగళవారం అనగా జూన్‌ 21 జరిగిన 4వ వన్డేలో ఆసీస్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్‌ అవ్వగా, ఛేదనలో ఆసీస్‌  50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
 
ఇకపోతే, లంక జట్టులో ఎవరు ఏ విధంగా ఆడారో ఒకసారి చూస్తే, చరిత్‌ అసలంక 106 బంతుల్లో 110 (10 ఫోర్లు, 1 సిక్స్‌)తో సత్తా చాటగా, ధనంజయ డిసిల్వ 61 బంతుల్లో 60 (7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఇరగదీసాడు. ఇక ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ 112 బంతుల్లో 99 (12 ఫోర్లు) కొట్టి త్రుటిలో సెంచరీ చేజార్చుకోవలసి వచ్చింది. ఇక చివర్లో దిగిన ప్యాట్‌ కమిన్స్‌ 43 బంతుల్లో 35 (2 ఫోర్లు), కునెర్మన్‌ 12 బంతుల్లో 15 (3 ఫోర్లు) పరుగులు చేసి గట్టిగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  
 
లంకతో జరిగిన 4వ వన్డేలో ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ కేవలం ఒక్కటే అంటే ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకోవడం దురదృష్టకరరం. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి బాధ్యతాయుతంగా ఆడిన వార్నర్‌ 99 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్ అవడం గమనార్హం. తద్వారా వన్డే క్రికెట్‌ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్‌ ఔట్‌ అయిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2002లో నాగ్‌పూర్‌ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఆటగాడు VVS లక్ష్మణ్‌ ఇలానే 99 పరుగుల వద్ద స్టంప్‌ అవ్వడం అందరికీ తెలిసినదే. ఇన్నాళ్లకు అది మరలా రిపీట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: