PCB (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) ఓ సరికొత్త ప్రయోగానికి నంది పలికిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఆన్లైన్లో కోచింగ్ తీసుకోనున్న జట్టుగా పాక్ క్రికెట్ జట్టు చరిత్రపుటల్లోకి ఎక్కింది. ఆస్ట్రేలియా జట్టు మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ సరిగ్గా నాలుగేళ్ల తర్వాత తిరిగి పాక్ హెడ్ కోచ్ గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడని పాక్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై PCB చైర్మన్ అయినటువంటి నజమ్ సేథీ గత వారం ఓ మీడియా వేదికగా మాట్లాడినట్టు తెలుస్తోంది.

అవును, PCB సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుందని, ఈ విషయమై ఆర్థర్ తో చర్చలు నెరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పాక్ కోచ్ అయినటువంటి సక్లయిన్ ముస్తాక్ పదవీకాలం త్వరలో ముగుస్తున్న నేపథ్యంలో నూతన హెడ్ కోచ్ ని నియమించే పనిలో PCB తనామునకలై వుంది. దీనికి ఆర్థర్ మొదట ససేమిరా అన్నప్పటికీ.. ఆన్లైన్ కోచింగ్ ప్రతిపాదన నచ్చి ఒప్పుకున్నాడని భోగట్టా. ప్రస్తుతం డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఆర్థర్.. మెజార్టీ శాతం పాక్ పాల్గొనబోయే టోర్నీలకు ఆన్లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించుకున్నాడు.

అయితే ఈ ఏడాది ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కి మాత్రం ప్రత్యక్షంగా అందుబాటులో ఉండేందుకు అంగీకరించాడని తెలుస్తోంది. ఇకపోతే, మిక్కీ ఆర్థర్ ఆథ్వర్యంలో పాకిస్తాన్ 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతన్ ని ఓడించి ఛాంపియన్ గా అవతరించిన సంగతి విదితమే. ఆ తరువాత 2019 వన్డే వరల్డ్ కప్ పాక్ నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించడంతో ఆర్థర్ తన పదవికి రాజీనామా చేసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడం జరిగింది. ఇదిలా ఉంటే, PCB ఆన్లైన్ కోచ్ ప్రతిపాదనపై వారి సొంత దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. ఎందుకంటే స్వదేశంలో నాణ్యమైన కోచ్ లేకపోవడం వల్లనే విదేశీ కోచ్ ని పెట్టుకుంటున్నారని పాక్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: