ప్రపంచ నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా.. పుంకాను పుంకాలుగా వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది అని కొందరు అంటుంటే.. మరి కొందరు ఏకంగా చనిపోయాడనే అంటున్నారు. అసలు ప్రపంచం మొత్తం కిమ్ ఎలా ఉన్నాడు ? అని తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్తో అతలాకుతలం అవుతోన్న అన్ని ప్రపంచ దేశాల అధ్యక్షులు బయటకు వచ్చి తాము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ? చెపుతుంటే కిమ్ మాత్రం ఎక్కడా కనపడడం లేదు.
ఇక కిమ్ గురించి తెలుసుకునేందుకు అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలోనే కిమ్ను కనిపెట్టేందుకు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే
38 నార్త్ అనే వెబ్ సైట్ అనేక శాటిలైట్ చిత్రాలను విశ్లేషించింది. ఉత్తర కొరియా, దాని చుట్టు పక్కల ప్రాంతాలపై ఈ వెబ్సైట్ నిరంతరం నిఘా వేస్తూ ఉండే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలోనే సదరు వెబ్సైట్ తీసిన చిత్రాల ప్రకారం కిమ్కు చెందిన ట్రైన్ ఏప్రిల్ 21 నుంచి 23 వరకు ఉత్తర కొరియా తూర్పు తీరంలో ఉన్న వోన్సన్ అనే రైల్వే స్టేషన్లో ఆగి ఉన్నట్లు గుర్తించింది. దీంతో అసలు ఈ ట్రైన్ ఇక్కడ ఎందుకు ఉంది ? కిమ్ను అక్కడ రహస్య ప్రదేశంలో ఉంచి వైద్యం అందిస్తున్నారా ? అసలు ఏం జరుగుతోంది ? అన్నది మాత్రం ప్రపంచానికి అంతు పట్టడం లేదు.