ఇటీవలి కాలంలో మనుషులకు మనుషుల మీద ఉన్న ప్రేమ కంటే అటు పెంపుడు జంతువుల మీద ప్రేమ ఎక్కువగా పెరిగి పోతుంది అని చెప్పాలి. అంతేకాదు నేటి రోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. కొంతమంది జంతు ప్రేమికులు పెంపుడు కుక్కలను పెంచుకుంటే మరి కొంత మంది మాత్రం ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా అనుకుంటూ కుక్కలను పెంచుకుంటున్నారు. ఇంట్లో మనిషి లాగా కాదు ఏకంగా సొంత మనిషిలాగ పెంపుడు కుక్కలను చూసుకుంటూ అమితమైన ప్రేమను చూపిస్తున్న వారు కూడా నేటి రోజులలో చాలామంది ఉన్నారు.


 కేవలం పెంపుడు కుక్కల యజమానులే కాదు అటు జంతువులు సైతం తమ యజమానుల పట్ల అంటే ప్రేమ విశ్వాసం  చూపిస్తున్న ఘటనలు కూడా సోషల్  మీడియాలో ఇటీవలి కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్ల హఠాత్తుగా చనిపోతే ఎవరైనా బాధపడతారు. రెండు మూడు రోజులు బాధపడటం ఇక ఆ తర్వాత కొత్త కుక్కపిల్లలు తెచ్చుకొని పెంచుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం పెంపుడు కుక్క చనిపోయిందని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పెంపుడు కుక్క గురించి ఆలోచించినంతగా తన కుటుంబం గురించి మాత్రం ఆలోచించలేక పోయాడు.


 పెంపుడు కుక్క చనిపోయిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కొవ్వూరు లో చోటుచేసుకుంది. దొమ్మేరు సావరానికి చెందిన శ్రీను అనే 36 ఏళ్ల వ్యక్తి చాలా కాలంగా ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. ఇటీవలే ఆ కుక్క చనిపోయింది. దీంతో శ్రీను ఎంతగానో మనస్థాపానికి గురయ్యాడు. కుక్క లేకుండా ఈ లోకంలో బ్రతకలేను అనుకున్నాడూ. చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా శ్రీను భార్య రాజమణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: