ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అందరూ ఎలాగో సెల్ఫీ తీసుకుంటారు. కానీ అందరిలా మేం కూడా సెల్ఫీ తీసుకుంటే అందులో కొత్తగా ఏముంటుంది. అందుకే అందరికంటే భిన్నంగా కాస్త కొత్తగా ట్రై చేసి సెల్ఫీ తీసుకుంటే ఆ సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇక మనకంటే తోపులు ఎవరూ ఉండరు అని అనుకుంటున్నారు నేటి రోజుల్లో జనాలు. సోషల్ మీడియాలో లైకుల ఊబిలో కూరుకుపోయి లైకుల కోసం చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. చిత్రవిచిత్రమైన సెల్ఫీ లతో సోషల్ మీడియాను నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ప్రమాదపు అంచుల వరకు వెళ్లి సెల్ఫీ తీసుకొని ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఎక్కువై పోతున్నారు నేటి రోజుల్లో. ఇలా ఇటీవలికాలంలో సెల్ఫీ పిచ్చి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. ఇంటర్ చదువుకుని అక్కడినుంచి చదువు ఆపేసి ఖాళీగా ఉంటున్నాడు వీర బ్రహ్మం అనే యువకుడు. ఇకపోతే ఇటీవల కాస్త కొత్తగా సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నాడు. ఆగివున్న గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కాడు. ఈ క్రమంలోనే సెల్ఫీ తీసుకునేందుకు ఒక చేయి పైకి ఎత్తగా ప్రమాదవశాత్తు చెయ్యి హై టెన్షన్ కరెంటు తీగకు తగిలింది. ఇంకేముంది ఒక్కసారిగా శరీరం కాలిబూడిదైపోయింది. ఇలా కాలుతున్న శరీరం తోనే రైలు మీద నుంచి కింద పడిపోయాడు సదరు యువకుడు. వెంటనే గమనించిన అధికారులు మంటలు ఆర్పీ అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది