నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈయన ఎంత గొప్ప వారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు.ఆయన మరణం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది.సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23 న భారతదేశంలోని ఒడిషా లోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. గొప్ప జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. తల్లి పేరు ప్రభావతి దేవి. ఇక నేతాజీ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలో సాగింది.1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచారు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించారు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించారు.


భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు.సుభాష్ చంద్రబోస్ రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా కూడా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీ  అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా చాలా ముఖ్యమని నేతాజీ భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డారు. 1939 వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇది ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా నేతాజీ భావించారు.


యుద్ధం ప్రారంభం కాగానే ఆయన ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించారు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని సిద్ధం చేశారు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచారు.నేతాజీ  మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరిణించారని ప్రకటించినప్పటికి, ఆయన ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. ఏది ఏమైనా ఆయన మరణం మాత్రం ఇప్పటికీ ఎవ్వరు కనుగొనలేని రహస్యంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: