సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో వరుసగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఏపీ ప్రజలు మాత్రం దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఈ వేడుకలు జరుపుకునేందుకు సొంత ఊళ్లకు వచ్చేస్తారు. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు.
అయితే ఈ పండుగను తమ కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకునేందుకు సిటీ ప్రజలు సొంతూర్లకు బయలుదేరతారు. ఈ పండుగ వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం అన్నివర్గాలకు చెందిన ప్రజలు సగం మంది ఊర్లకు వెళుతుంటారు. ఇక ఇప్పటికే కొంతమంది వెళ్లగా, మరికొంతమంది మంగళ, బుధవారాల్లో వెళ్తుంటారు. ఈక్రమంలోనే ప్రయాణికులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి పోతున్నాయి. శత సంతోషాలను పంచే పండగకు సొంత ఊరుకు వెళ్లడం అంటే నరకం.
పెరిగిపోయిన జనాభాకు చాలినన్ని రవాణా సదుపాయాలు లేకపోవడం ఈ సమస్యను మరింత పెంచింది. హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇళ్లకు రావడం చాలా ఇబ్బందిగా మారింది. ఇదే అదనుగా ప్రయివేటు వాహనాల యాజమాన్యాలు ఇష్టానుసారంగా చార్జీలు పెంచేశాయి. దూరాన్ని బట్టి టికెట్టు మీద అదనంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టిక్కెట్ల రేట్లు 4-7 వేల వరకు ఉంటున్నాయి. దీంతో జనాలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.