టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు వచ్చాయి. అందులో `అతడు`, `గుంటూరు కారం` చిత్రాలు బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. 2010లో విడుదలైన `ఖలేజా` చిత్రం మాత్రం పరాజయం పాలైంది. అయితే స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా కల్ట్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. ఆ సంగతి పక్కన పెడితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో మరొక సినిమా రావాల్సి ఉంది. కానీ ఆరంభంలోనే అది ఆగిపోయింది.


ఇంతకీ ఆ చిత్రం ఏంటో తెలుసా.. `హరే రామ హరే కృష్ణ`. అత‌డు విడుద‌ల అయ్యాక త్రివిక్ర‌మ్‌, మ‌హేష్ బాబు కాంబోలో `ఒక్క‌డు` నిర్మాత ఎం.ఎస్‌. రాజు మ‌రొక సినిమాను ప్లాన్ చేశారు. అందులో భాగంగానే `హ‌రే రామ హరే కృష్ణ‌` ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యారు.


అయితే ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాక బడ్జెట్ రూ. 80 కోట్ల వరకు అవుతుందని త్రివిక్రమ్ మరియు ఎం.ఎస్ రాజు అంచనా వేశారు. అప్పటికి 80 కోట్ల బడ్జెట్ పెట్టేంత మార్కెట్ మహేష్ బాబుకు లేదు. ఆ కారణంతోనే ఎం.ఎస్ రాజు తాత్కాలికంగా ఆ ప్రాజెక్టును పక్కనపెట్టారు. కొద్ది రోజులకు మహేష్ బాబు `పోకిరి` మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆయన మార్కెట్ 70 కోట్లకు పెరిగింది.


కానీ అప్ప‌టికి ఎం.ఎస్. రాజు నిర్మించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో హ‌రే రామ హరే కృష్ణ ప్రాజెక్ట్‌ను ఆయ‌న పూర్తిగా అట‌కెక్కించారు. మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ మిడ్ రేంజ్ సినిమా తీద్దామ‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే అదే టైమ్‌లో  రవితేజతో `వీడే` వంటి చిత్రాన్ని నిర్మించిన శింగనమల రమేశ్ ఎంట్రీ ఇచ్చి మహేష్, త్రివిక్రమ్ ల‌కి అడ్వాన్స్‌లు ఇచ్చేసి లాక్ చేశారు. ఆ తర్వాత సి.కళ్యాణ్ కూడా నిర్మాణంలో భాగం కావ‌డంతో ఖ‌లేజా మూవీ మ‌న ముందుకు వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: