మరో పోరాటానికి హజారే సిద్ధం..
అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. లోక్ పాల్ నియామకంపై కేంద్రం చూపుతున్న ఉదాసీనత వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగనున్నట్టు హజారే బుధవారం ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు లోక్ పాల్ నియామకం జరగకపోవడం పట్ల ఆయన ఆందోళన చేశారు.
ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కీలకమైన ఆర్థిక బిల్లుకు రాజ్యసభ బుదవారం నాడు ఆమోదం తెలిపింది. సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు సభ ఆమోదించింది. ఈ బిల్లును బుదవారం నాడు ఉదయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సవరణలు ప్రతిపాదించాయి. ఈ సవరణలపై కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్, సిపిఎం నేత సీతారాం ఏచూరి ఓటింగ్ ను కోరారు. అనంతరం ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతుండగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.
జీఎస్టీ ఆలస్యం వల్ల 12 లక్షల కోట్ల నష్టం..
జీఎస్టీ బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ జరుగుతున్నది. జీఎస్టీ బిల్లు అమలు ఆలస్యం కావడం వల్ల దేశం సుమారు 12 లక్షల కోట్లు నష్టపోయినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇవాళ చర్చ సందర్భంగా ఆ పార్టీ తరపున ఎంపీ వీరప్పమొయిలీ మాట్లాడారు. తమ పార్టీ వల్ల జీఎస్టీ ముందుకు వెళ్లుతున్నదని ఆయన అన్నారు. కానీ పార్లమెంట్లో ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగకరమైన బిల్లు గురించి చర్చించాలన్న ఉద్దేశంతోనే సభలో జీఎస్టీ చర్చకు అంగీకరించామన్నారు.
ప్రసూతి చట్టం-2017కు రాష్ట్రపతి ఆమోదముద్ర
దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులకు శుభవార్త. ప్రసూతి సెలవులను 12 వారాలు నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం-2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదమూద్ర వేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 18లక్షల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చట్టం ద్వారా ప్రపంచంలో ప్రసూతి సెలవులు ఎక్కువ ఇచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది.
సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్
దేశీయ ఆటో మేజర్లకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా బీఎస్-3 వాహనాలపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆటోమొబైల్ కంపెనీల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యమని సుప్రీం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నాయని తీర్పు చెప్పింది. ఏప్రిల్ తరువాత బీఎస్-3 వాహనాల రిజిస్ట్రేషన్లను, అమ్మకాలను నిలిపి వేయాలని పేర్కొంది. దీంతో రూ.12వేల కోట్ల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఒక్కసారిగా నిరుపయోగంగా మారింది.