రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జంగన్మోహన్ రెడ్డి పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయనను పులివెందులకు పంపే దాకా వెనుకాడబోమని టీడీపీ చంద్రబాబు తేల్చి చెప్పారు. సోమవారం వైసీపీ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడేదిలేదన్నారు. వైసీపీ నేతలు దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం రివర్స్ లో పాలన చేస్తుందన్నారు. కొత్తగా ఏదో చేయాలని అంతా గందరగోళం సృష్టిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసును చేదించలేకపోయారని విమర్శించారు, సచివాలయం పరిక్ష పత్రాల లీక్ అంశాన్ని తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. గోదావరి లో మునిగిన బోటును బయటకు తీయలేకపోయారన్నారు. వైజాగ్ వాల్తేర్ క్లబ్ పై వైసిపి పెద్దల కన్ను పడిందని ఏరోపించారు. రాష్ట్రం లో శాంతిభద్రతలు కరువయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెలను వేధించి చంపారని చంద్రబాబు స్పష్టం చేశారు. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ను జీవితాంతం జైలులో పెట్టినా చాలదన్నారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలను కాపాడామన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు. కొంతమంది పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. స్టిక్కర్ల మాదిరిగా తయారయ్యారన్నారు. నిజాయితీపరులైన పోలీసులు సెలవుపై వెళ్తున్నారన్నారు. వివేకానందరెడ్డిని సుపారీ హత్య చేస్తే విచారణకు దిక్కులేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్తో జైలుకు వెళ్లినవారికి ఉన్నత పదవులు ఇచ్చారన్నారు.డీజీపీ... చట్టాన్ని గౌరవించేవారిలో తాను ముందుంటానన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఖబడ్దార్ అని చంద్రబాబు హెచ్చరించారు.