తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన మేనల్లుడు, రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు ఊహించని షాకులు ఇస్తున్నారని అంటున్నారు. రెండో దఫా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి హరీశ్రావును దూరం పెడ్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా ఆయన మంత్రి పదవి ఇచ్చినప్పటికీ...అదే పరిస్థితి ఉందంటున్నారు.
గత డిసెంబరులో టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. ఆ వెంటనే పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవటంతో ఆర్థికశాఖ కొద్ది నెలలపాటు సీఎం వద్దనే ఉండిపోయింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా హరీశ్రావుకు ఆ శాఖను కేటాయించారు. హరీశ్ మంత్రి పదవి చేపట్టిన కొద్ది నెలలకే రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఆ సందర్భంగా శాసనసభలో హరీశ్ రావు బడ్జెట్ను ప్రతిపాదిస్తారని అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టి హరీశ్కు షాకిచ్చారు.
దీనికి కొనసాగింపుగా...తాజాగా హరీశ్ రావు ఇంకో షాకిచ్చారు. 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ రూపకల్పనకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈనెల ఏడున ప్రగతిభవన్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ ఎస్కే జోషీతోపాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు అందు లో పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ నిధులు విడుదల కాకపోవటం, కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను గణనీయంగా తగ్గించటంపై ముఖ్యమంత్రి కూలంకుషంగా చర్చించారు. ఈ క్రమంలో అన్ని శాఖలు పొదుపు చర్యలు పాటిస్తూ నిధులను సమాంతరంగా తగ్గించాలంటూ సూచించారు.అంతటి కీలకమైన సమావేశంలో హరీశ్ రావు పాల్గొనకపోవటం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం నిబంధనల ప్రకారం సరైనదే అయినప్పటికీ...సంబంధిత మంత్రి హరీశ్ రావు లేకుండా చేయడం గమనార్హం.