ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర శాస‌న‌మండ‌లి రద్దు చేయాలన్న కీలక నిర్ణయాన్నిసుధీర్ఘ చర్చ తర్వాత అసెంబ్లీ ఆమోదించింద‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. సోమ‌వారం కీలకమైన నిర్ణయాన్ని శాసనసభ తీసుకోవడం జరిగిందని ఆయ‌న పేర్కొన్నారు. 1983లో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్నే ఈరోజు సీఎం జగన్ తీసుకున్నారని వెల్ల‌డించారు. తాడేపల్లిలోని పార్టీ కేేంద్ర కార్యాలయంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన అంబ‌టి రాంబాబు చాలా రాష్ట్రాలలో మండలి లేకుండానే పరిపాలన సాగుతోందని స్ప‌ష్టం చేశారు. 

 

కీలక నిర్ణయాన్ని తీసుకునే సమయంలో చంద్రబాబు ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయారని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. ``మీ అభిప్రాయాన్ని అసెంబ్లీలో చెప్పేందుకు ఎందుకు వెనకాడారు చంద్ర‌బాబు?  పరిమితులకు లోబడి పనిచేయాల్సిన శాసనమండలిని దానికి విరుద్దంగా పనిచేసేలా చంద్రబాబు ఓవరాక్షన్ చేశారు. 8 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై చంద్రబాబు పిచ్చి సవాళ్లు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు అసలు గౌరవం ఉందా? `` అని ప్ర‌శ్నించారు. 

 


టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబుకు అంత ఉబలాటంగా ఉంటే 23 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని అంబ‌టి స‌వాల్ విసిరారు. చంద్రబాబు లాంటి యూటర్న్ రాజకీయవేత్త దేశంలోనే లేరని ప్రజలంటున్నారని అంబ‌టి పేర్కొన్నారు. వెన్నుపోటు రాజకీయంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆయ‌న మండిప‌డ్డారు. `రాజకీయాల కోసం చంద్రబాబు ఎన్నో చేయకూడని పనులు చేశారు. కుమారుడి కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేశారు. రాజకీయం కోసం సొంత తమ్ముడినే నాశనం చేసిన ఘ‌నుడు చంద్రబాబు. ఆయ‌న‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై చౌకబారు విమర్శలు చేసే అర్హత  లేదు.`` అని ఆయ‌న పేర్కొన్నారు. 

 

సీఎం వైయస్ జగన్‌పై బురద చల్లడమే పనిగా కొన్ని పత్రికలు పెట్టుకున్నాయని అంబ‌టి మండిప‌డ్డారు. ``ఏం చెప్పినా చూపించే ఛానళ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై చంద్రబాబు దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు శాసనమండలిపై గతంలో ఏమన్నారు,ఇప్పుడు ఏమన్నారనేది ఆ ఛానళ్లు,పత్రికలు ఎందుకు చూపించవు.?` అని అంబ‌టి సూటిగా ప్ర‌శ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: