ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కరోనా వైరస్ ప్రాణ భయంతో గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అతి తక్కువగా నమోదైన కేసులు ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతుండడంతో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఏకంగా 1400 కు పైగా కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా అయోమయంలో పడిపోతున్నారు.
ముఖ్యంగా మొన్నటి వరకు ఎవరు నుంచి ఎవరికి కరోనా వైరస్ సోకింది అనేది స్పష్టంగా తెలిసేది... ఇక ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి వైరస్ సోకుతుందో అని అంచనా కూడా లేకపోవడంతో కరోనా వైరస్ ను కట్టడి చేయడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన దాదాపు 50 శాతం కేసులు కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. కర్నూలు జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించి కఠిన నిబంధనలు అమలు చేసినా అక్కడ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో ఈ ప్రపంచ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమని తాము కాపాడుకోవడమే కాదు పాడిపశువులను కాపాడుకోవడానికి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కర్నూలు వాసులు. కర్నూలు జిల్లాలో ఓ రైతు ఎడ్లబండిపై వెళ్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎడ్ల బండిపై వెళ్తూ ఆ రైతు ముఖానికి మాస్కు పెట్టుకోవడమే కాదు... ఎద్దుకు కూడా మాస్కు కట్టాడు. తన దగ్గర ఉండే టవల్ తో ఎద్దుకు ఒక మాస్క్ కట్టాడు రైతు. కర్నూలు నగరంలోని ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. జంతువులకు కూడా కరోనా వైరస్ సోకుతుంది అని టీవీ లో అప్పుడప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.