జగన్ ప్రభుత్వ హయాంలోనూ కాపు కార్పొరేషన్కు నిధులు కేటాయిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఏటా వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఇక, ఇప్పుడు జగన్ దీనిని మించి నిధులు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో చూపిస్తున్నారు.కానీ, వాస్తవానికి కాపులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలు ఏవీ ఇప్పటికీ తెరమీదికి రాలేదు. ఇక, జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్ను చేశారు.
ఆయన కూడా కార్పొరేషన్కు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో .. ఎవరికీ తెలియదు. ప్రస్తుతం కాపులు తమకు కార్పొరేషన్ ద్వారా ఒరుగుతున్న ప్రయోజనం ఏమీ కనిపించడం లేదని స్పష్టం గా చెబుతున్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పథకాల్లో చాలా వాటిని జగన్ ప్రభుత్వం తొలగించింది. పింఛన్లు, విద్యకు అవసరమైన ప్రోత్సాహకాలను ఎత్తేశారు. దీనికి కారణం.. ఇతర సామాజిక పింఛన్లతోపాటు వీరికి కూడా అమలు చేస్తున్నాం కనుక.. అని వారు చెబుతున్నారు.
అయితే.. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు కాపులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు కాపులు, కానీ, వారికి ఏ కార్యక్రమమమూ ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో వారిలో ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని బట్టి కాపు కార్పొరేషన్ నాడు బాగున్నా.. నేడు మాత్రం నిర్వీర్యం దిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు.