ఈ అలజడులకు సంబంధించి నిఘా వర్గాల వద్ద పక్కా సమాచారం ఉందట. ఈ అలజడులపై పాక్ కుట్ర చేస్తోందనడానికి కొన్ని సోషల్ మీడయా ఖాతాలను కూడా నిఘా వర్గాలు గుర్తించాయట. ఈ నెల 13 నుంచి 18 వరకు మొత్తం 308 సోషల్ మీడయా ఖాతాలు గుర్తించినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు రైతుల ట్రాక్టర్ల పరేడ్ కు రైతు సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రశాంతంగా ట్రాక్టర్ల పరేడ్ నిర్వహణకు రైతుసంఘాల సన్నాహాలు చేస్తున్నాయి.
ఈ ర్యాలీలో సింఘు, టిక్రి, ఘాజీపూర్ నుంచి ట్రాక్టర్లు బయలుదేరతాయి. పల్వాల్, షాహజాన్పుర్ సరిహద్దుల నుంచి కూడా మరికొన్ని ట్రాక్టర్లు బయల్దేరతాయి. ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల తర్వాత ట్రాక్టర్ల పరేడ్ ఉంటుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. దిల్లీ ఔటర్ రింగ్రోడ్లో 100 కిలోమీటర్ల మేర ప్రయాణించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ రైతు సంఘాలు
సమన్వయం కోసం ప్రతి సరిహద్దు కేంద్రం వద్ద 40 మందితో వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాయి కూడా.
అంతే కాదు... అత్యవసర పరిస్థితుల కోసం 40 అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఒక ట్రాక్టర్పై ఐదుగురు రైతులను అనుమతించారు. ఇప్పటికే దేశ రాజధాని దిల్లీ వైపు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు తరలివెళ్తున్నాయి. గణతంత్ర దినోత్సవంలో మాదిరిగానే శకటాలను రైతులు ప్రదర్శిస్తారు. మొత్తం 30 శాతం ట్రాక్టర్లను శకటాలకు కేటాయించారు. సాగు చట్టాలు, వ్యవసాయం, పల్లె జీవితాలు, మహిళల పాత్ర, పశువుల పెంపకం తదితర అంశాలతో రైతుల శకటాలు నిర్వహిస్తారు.