కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంస్థలు మూతపడి పిల్లల భవిష్యత్తు  ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇదంతా మనకి ఒక వార్త మాత్రమే కానీ ఇది విద్యా సంస్థలపై ఆధారపడి గడుస్తున్న ఎంతోమంది జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్...అదేవిధంగా పరోక్షంగా విద్యాసంస్థలపై ఆధారపడి బ్రతుకుతున్నవారందరిపై  కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా టీచర్ల పరిస్థితి ఈ లాక్ డౌన్ కారణంగా అగమ్యగోచరంగా మారింది. పాఠశాలలు నడవకపోవడంతో జీతాలు రాక ఉపాధ్యాయులు నానా కష్టాలు పడ్డారు.

ఆర్థిక పరిస్థితులు కారణంగా ఎంతో మంది తమ వృత్తికి  భిన్నంగా వేరే పనులను కూడా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు  విద్యాసంస్థలు తిరిగి పునఃప్రారంభం అయినప్పటికీ..ఆర్థికభారం కారణంగా యాజమాన్యాలు ఎంతో మంది ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. లిమిటెడ్ స్టాఫ్ తో మాత్రమే చాలా ప్రైవేట్ సంస్థలు రన్ అవుతున్నాయి. ఇలా ప్రైవేట్ విద్యారంగంలో పనిచేసే టీచర్లకు ఆర్థిక భద్రత లేకపోవడం బాధాకరం. అంతేకాదు భారత్ దేఖో అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ లో సర్వే చేయగా టీచర్ల గురించి కొన్ని భాదాకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కరోనా లాక్ డౌన్ లో హైదరాబాద్ లోని 90 శాతం మంది టీచర్లు పూట గడవక తమ బంగారాన్ని అమ్ముకున్నారని తేలింది.

83 శాతం మంది టీచర్లు ఇంటి రెంటు కట్టలేని స్థితిలో 5 నెలలకు పైగా ఓనర్లకు బాకీ  పడ్డారని సర్వేలో వెల్లడైంది. 220 మంది ప్రైవేట్ టీచర్లను సర్వే చేసిన ఈ సంస్థ, వారికి కనీసం ఆరోగ్య భీమా కూడా లేదని తేల్చింది. టీచర్లందరూ బిల్లు కట్టలేకపోయారని, బంధువుల నుండి అప్పులు కూడా చెయ్యాల్సి వచ్చింది అని 90 శాతం మంది చెప్పడం వాళ్ళ దయనీయ స్థితిని తెలియజేస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల భవిష్యత్తుకి భరోసా కలిగించే పథకాలు తీసుకు రావాలని వాళ్ళు వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: