బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి....ఏపీ ఆర్ధిక మంత్రి..జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకుడు. అలాగే కర్నూలు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుల్లో బుగ్గన కూడా ఒకరు. అందుకే బుగ్గన లాంటి నాయకులకు చెక్ పెడితే...దాదాపు వైసీపీకి చెక్ పెట్టినట్లే అని ప్రతిపక్ష టీడీపీ భావిస్తూ ఉంటుంది. అందుకే టీడీపీ, బుగ్గన టార్గెట్‌గా రాజకీయం చేస్తూ ఉంటుంది. ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా బుగ్గనకు చెక్ పెట్టడం టీడీపీ వల్ల కావడం లేదు.

పైగా ఆయన సొంత నియోజకవర్గం డోన్‌లో సైతం వైసీపీని నిలువరించడం అవ్వడం లేదు. ఇప్పటికే డోన్‌లో బుగ్గన హవా నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లో డోన్ నుంచి బుగ్గన భారీ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు జగన్ క్యాబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గనకు తిరుగులేకుండా పోయింది. మంత్రిగా ఉండటంతో బుగ్గనని దాటి డోన్‌లో టీడీపీ సత్తా చాటడం కష్టమైపోతుంది. అందుకే డోన్‌లో ఆ మధ్య జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుంది. అలాగే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కూడా వైసీపీ హవానే నడిచింది.

ఇక తాజాగా జరిగిన బేతంచెర్ల మున్సిపాలిటీని కూడా వైసీపీ దక్కించుకుంది. డోన్ పరిధిలో ఉన్న ఈ మున్సిపాలిటీలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కొనసాగింది. ఇక్కడ మెజారిటీ వార్డులు కైవసం చేసుకుని మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. 20 వార్డులకు వైసీపీ 14 వార్డుల్లో గెలిచింది.

అయితే టీడీపీ కూడా కాస్త పోటీ ఇచ్చింది. ఆరు వార్డుల్లో టీడీపీ హవా నడిచింది.  ఇక్కడ ఊహించని షాక్ ఏంటంటే బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ ఓడిపోయింది. వైసీపీపై టీడీపీ 114 ఓట్ల మెజార్టీతో గెలిచింది. కానీ మొత్తం మీద బేతంచెర్ల మున్సిపాలిటీ మాత్రం వైసీపీ గెలుచుకుంది. ఏదేమైనా డోన్‌లో బుగ్గనకు తిరుగులేదని మరోసారి రుజువైంది. మళ్ళీ డోన్‌లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: