ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తోన్న జవాద్ తీవ్ర తుపానుగా మారి.. విశాఖ వైపు దూసుకొస్తోంది. తర్వాత దిశ మార్చుకొని తీరం వెంటే పయనిస్తూ.. రేపు మధ్యాహ్నానికి ఒడిశా తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఈ మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

ఇక తుపాను ప్రభావిత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు జవాద్ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం ఎక్కువ కాకముందే చర్యలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 11మండలాల్లో తీవ్రత ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు తాగునీటి కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలని ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ -08942-240557, 833398270, పాలకొండ-08941-260144, 9493341965, టెక్కలి-08945-245188 నెంబర్లను అందుబాటులో ఉంచారు.

ఇక తూర్పుగోదావరి జిల్లాకు తుపాను గండం పొంచి ఉన్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్-18004253077, కాకినాడ ఆర్డీవో-0884-2368100, అమలాపూరం ఆర్డీవో-98856-233208, రామచంద్రాపురం ఆర్డీవో-6304353706,పెద్దాపురం ఆర్డీవో-9603663227, రాజమహేంద్రవరం-0883-2442344,రంపచోడవరం-08864-243561, ఎటపాక-08864-285999నెంబర్లను అందుబాటులో ఉంచారు. మొత్తానికి జవాద్ తుపాన్ ఉత్తారంధ్ర జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రజలు ఎవరూ బయటకు రాకపోవడమే మంచిది. వర్షం తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉంది.  కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు జాగ్రత్త.





















 

మరింత సమాచారం తెలుసుకోండి: