వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం కేసు పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గట్టి దాడులు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసిన అధికారులు, ఇప్పుడు మరో 12 మందిని అరెస్టు చేయాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈసారి పేర్లు వెల్లడైనవారిలో ముఖ్యంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉండటం పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసులో అవినాష్ రెడ్డిపై ఎలాంటి అనుమానాలు లేకపోయినా, తాజాగా సిట్ కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో ఆయనను A7గా పేర్కొనడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీస్తోంది.

ఇదే కాకుండా, మరొక ప్రముఖుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్నారు. మిగతా 11 మంది విజయవాడ జైల్లో ఉండగా, ఇప్పుడు నూతనంగా పేర్లు వచ్చిన 12 మందిలో చాలామంది ముఖ్యమైన బిజినెస్, రాజకీయ సంబంధాలు కలిగిన వారే కావడం గమనార్హం. ఈ పిటిషన్‌లో ఉన్న మరో ప్రముఖుల పేర్లు: ఏ40గా ఉన్న‌ పురుషోత్తం, ఏ41 అయిన‌ అనిరుద్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల బెహ్రెన్ .. ఈ అభియోగాల్లో పేర్లను చూడగానే చాలామందికి వైసీపీ కీలక నేతల జాబితానే గుర్తుకు వస్తోంది. ఇక వీరిలో కొందరు ఇప్పటికే విదేశాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందువల్ల కోర్టు అనుమతిస్తే వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇటీవల మద్యం కుంభకోణంపై వచ్చిన ఆడియోలూ, లీకులూ దీనికి స్పీడ్ అందించాయి. ఇప్పుడు అధికారికంగా పేర్లు కోర్టుకు సమర్పించడంతో కేసు చివ‌రి దశకు ప్రవేశించిందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇకపై అసలైన ప్రశ్న: ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయల మూలధనం ఎక్కడికి వెళ్ళింది? ఎవరి జేబుల్లోకి చేరింది? అన్నదే. అధికారులు ఇప్పటి వరకు అందుకున్న ఆధారాలతో ముందుకు సాగుతుండగా, కేంద్ర సంస్థలు కూడా దృష్టిపెడతాయని విశ్లేషకుల అభిప్రాయం. ఈ కేసులో ఏ నాయకుడు నెరపుడో, ఎవరి అరెస్టు ఇంకో షాకు అవుతుందో అన్నది వేచి చూడాల్సిందే. కానీ ఏ మాత్రం ఊహించని విధంగా అవినాష్ రెడ్డి పేరు బయటకు రావడం వైసీపీకి షాక్ ఇచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: