ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన ఈ పార్టీకి ఇకపై ప్ర‌ధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రజల్లో పుంజుకుంటున్న సంకేతాలు పెద్దగా కనిపించకపోయినా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైసీపీ నేతలు ఇంకా ప్రభావాన్ని చూపుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో జనసేన గెలిచింది, టీడీపీకి కూడా భారీ మెజారిటీ ఉన్నా, స్థానిక అధికారులపై వైసీపీకి చెందిన ఒక కీలక సీనియర్ నేత ప్రభావం ఇంకా కొనసాగుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి.


ఆయనకు ఉన్న పాత పరిచయాలు, గతంలో ఉన్నతాధికారులకు కల్పించిన సౌకర్యాలు, మేళ్లు… ఇవన్నీ ఇప్పుడు అధికారులను కూటమి ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా, ఆ నేత మాటే వినేలా చేస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ పాలనలో నియమించిన‌ అధికారులను కొత్త ప్రభుత్వం అనేక శాఖల నుంచి మార్చినా, చిత్తూరులో మాత్రం ఆ మార్పులు జరగలేదు. కారణం ఆ సీనియర్ నేత ఒత్తిడి అంటున్నారు. ఇది మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలోని శాఖకు సంబంధించినదే కావడం గమనార్హం.


పవన్ కళ్యాణ్, ఆ వైసీపీ నేత మధ్య పాత వైరం ఉన్నా ఆయన ఆదేశాలు జిల్లాలో అమలుకావడం లేదు. చిత్తూరు జిల్లాలో అటవీ భూభాగం విస్తారంగా ఉండటం, ఎర్రచందనం అక్రమ రవాణాకు ఈ ప్రాంతం పేరుపొందడం వల్ల గతంలోనూ, ఇప్పుడూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆరు నెలల క్రితమే కీలక అధికారులను మార్చాలని నిర్ణయించినా, చిత్తూరులో ఉన్నతాధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టారు. దీనికి కారణం వైసీపీ సీనియర్ నేత ప్రభావమేనని కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి. పై నుంచి కింది స్థాయి వరకు పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది అందరూ ఆ నేత కనుసన్నల్లోనే నడుస్తున్నారని సమాచారం. ఈ క్ర‌మంలోనే కూట‌మి ప్ర‌భుత్వంలోనూ ఆ వైసీపీ నేత త‌న ప‌వ‌ర్ చూపిస్తున్నార‌న్న టాక్ బాగా న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: