ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు.. త్వరలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటల టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారనడం కంటే.. పార్టీలో మంచి పేరున్న ఈటల రాజేందర్‌ను మెడపట్టి బయటకు గెంటేశారనే చెప్పాలి. ఏకంగా ఓ మంత్రిపైనే సొంత మీడియాలో భూకబ్జా కథనాలు ఇప్పించుకుని.. వాటి ఆధారంగా విచారణకు ఆదేశించి.. గంటల్లో వ్యవధిలోనే తప్పు చేశారని తేల్చి.. మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేసేశారు. పార్టీ వీడటం మినహా ఈటలకు వేరే ఆప్షన్ లేకపోయింది.

అంటే ఈటలను వదిలించుకోవాలనుకున్న కేసీఆర్ ఆ పని పక్కాగా చేసేశారు. అయితే పార్టీని వదిలిపోతూ ఈటల రాజేందర్ కొన్ని పార్టీ అంతర్గత విషయాలపై విమర్శలు చేశారు. వాటిలోప్రధానమైంది.. ప్రగతి భవన్‌ .. బానిస భవన్‌గా మారిందని.. విమర్శించారు. కేసీఆర్‌ కనీసం మంత్రులకు కూడా దర్శనం ఇవ్వరని.. ఆయనతో మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా.. అపాయిట్‌మెంట్ దొరకలేదని ఈటల చెప్పారు. అయితే ఈ విషయం కొత్తదేమీ కాదు. కానీ ఈటల వ్యవహారంతో మరోసారి హైలెట్ అయ్యింది.

సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వం అలాగే ఉంటుంది. పార్టీ చీఫ్ ఏంది చెబితే అదే శాసనం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. కేసీఆర్ స్పెషాలిటీ ఏంటంటే.. కనీసం ప్రజాస్వామ్యయుతంగా కనిపించేందుకు కూడా ప్రయత్నించరు. మంత్రులకు కూడా అపాయిట్‌మెంట్ దొరక్కపోవడం... రోజుల తరబడి ప్రజలకు కనిపించకపోవడం.. అసలు సెక్రటేరియట్‌కు రాకపోవడం.. ఇలాంటి ప్రత్యేకతలు కేవలం కేసీఆర్ విషయంలోనే కనిపిస్తాయి. ఇప్పుడు ఈటల గెంటివేత వ్యవహారంలో కేసీఆర్ నియంతృత్వ లక్షణాలపై మరోసారి చర్చ జరుగుతోంది.

అన్నీ బాగా ఉన్నప్పుడు ఏదైనా చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ విషయంలో జరుగుతున్నదదే.. కానీ.. మేం ఎవరికీ జవాబుదారీ కాదు.. మేం చెప్పిందే శాసనం.. మేం చేసిందే రైటు అనుకుని ముందుకు సాగడం అంత మంచిది కాదు. పరిస్థితులు అననుకూలంగా మారినప్పుడు ఇవే అంశాలు ఇబ్బందికరంగా మారతాయి. ఈ విషయం కేసీఆర్ టీమ్ గుర్తించడం మంచిదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: