
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక క్రమశిక్షణపై కొన్ని రాష్ట్రాలు గాడి తప్పి వ్యవహరిస్తున్నాయని చేసిన వ్యాఖ్యలపై కూడా వినోద్ కుమార్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని చేసిన.. చేస్తున్న అప్పులను భవిష్యత్ తరాల కోసం ఆస్తులుగా తయారు చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ స్పష్టం చేశారు. అప్పులను కేవలం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పై వెచ్చిస్తోందని, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రానున్న రోజుల్లో పదింతలు రెట్టింపు విలువను చేయనుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పులను తీసుకొచ్చి కాలేశ్వరం ప్రాజెక్టును, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల కోసం మాత్రమే వెచ్చించిందని, తద్వారా అద్భుతమైన ఫలితాలు రాష్ట్రంలో సాధ్యమవుతున్నాయని.. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో పంటలు పుష్కలంగా పండుతున్నాయని, వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని, రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ తెలిపారు. భూగర్భంలో దాదాపు 600 టీఎంసీల నీళ్లు భద్రపడి ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ వివరించారు.