తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షో జబర్ధస్త్. గత ఏడేళ్లుగా ఈ షో అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. వాస్తవానికి ఈ షోకు మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో.. యూట్యూబ్లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు. అంతేకాదు ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ షోతోనే మెగా బ్రదర్ నాగబాబుకు మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. జబర్ధస్త్ సెట్పై బాగా క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఆటో రాంప్రసాద్ ఒకరు.
బుల్లితెర ప్రేక్షకులను ఆటో రాంప్రసాద్ పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎడిటర్గా ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా ఇప్పుడు సత్తా చూపిస్తున్నాడు రాంప్రసాద్. ప్రస్తుతం హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు రాంప్రసాద్. రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'త్రీ మంకీస్'. ఈ మూవీని జి. నగేష్ నిర్మించారు. ప్రస్తుతంఈ సినిమా కోసం జబర్దస్త్ టీం అంతా కలిసి వచ్చారు. అంతా కలిసి సుడిగాలి సుధీర్ టీం నటించిన సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఆటో రామ్ ప్రసాద్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైతే.. ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయే ఆలోచన ఉందా.. చాలా కొత్త షోలు మొదలవుతున్నాయి కదా అందులోంచి ఆఫర్స్ రావడం లేదా.. ఎందుకు వెళ్లట్లేదని అడిగితే.. ఈయన ‘జబర్దస్త్’లో చేస్తే వచ్చే పేరు ఇక ఏ షోలో చేసినా రాదు. అందుకే నేను వేరే ఏ షోకి వెళ్లలేదు. ‘జబర్దస్త్’ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. అది ఒక మ్యాజిక్. మళ్లీ ఒక కొత్త షోతో అలాంటి మ్యాజిక్ జరగాలంటే సాధ్యం కాదని తేల్చేసాడు ఈ కమెడియన్.
అందుకే తాను ఎక్కడికి వెళ్లడం లేదని.. వచ్చినా జబర్దస్త్ చచ్చినా వదిలిపెట్టనని క్లారిటీ ఇచ్చేసాడు రాంప్రసాద్. మొత్తానికి ఎన్ని షోలు వచ్చినా కూడా జబర్దస్త్ ముందు తుస్ అంటున్నాడు ఈయన. దీంతో అసలు దూమారానికి తెరలేచింది. ఈ పంచ్లు నాగబాబుకే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ఇటీవలే జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారు నాగబాబు. కొత్త షో.. కొత్త పారితోషికం అని వెళ్లిన నాగబాబుకు ఇప్పుడక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలు బుల్లితెరపై హాట్ టాపిక్గా మారాయి.