దేశ రాజధాని ప్రాంతానికి భారీ భూకంప ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ హెచ్చరించింది. గత మే 29 నుంచి ఇప్పటివరకూ దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోటుచేసుకున్న 14 భూప్రకంపనలు అసాధారణమేమీ కాదని, ఈ ప్రాంతంలో పీడనశక్తి పెరుగుతోందని చెప్పడానికి ఇవి సంకేతాలని పేర్కొంది.

 

 

భూగర్భ రాతి ఫలకల్లో ఉన్న పీడనశక్తి (స్ట్రెయిన్‌ ఎనర్జీ) విడుదల కావడం వల్లే ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో తరచూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరదిశన ఇండియన్‌ ప్లేట్‌ కదలడంతోపాటు, యూరాసియన్‌ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల... బలహీనమైన జోన్లలోని రాతినెర్రెల ద్వారా పోగైన శక్తి విడుదలై ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దిల్లీ రాజధాని ప్రాంతంలోని దిల్లీ-హరిద్వార్‌ కొండ ప్రాంతం, మహేంద్రగఢ్‌-డెహ్రాదూన్‌, మురాదాబాద్‌, సోహ్నా, గ్రేట్‌బౌండ్రీ, దిల్లీ-షార్గోఢా, యమున, గంగానదీ ప్రవాహ ప్రాంతం బలహీనమైన జోన్ల పరిధిలోకి వస్తాయి.

 

 

హిమాలయాల అడుగుభాగంలో ఇండియన్‌ ప్లేట్‌, యూరేషియన్‌ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల పీడనశక్తి కేంద్రీకృతమవుతోంది. ఆ శక్తి బలహీనమైన జోన్ల ద్వారా విడుదల కావడం వల్ల... అక్కడి రాతిపొరల్లో సూక్ష్మ (3.0లోపు), చిన్న (3-3.9లోపు), తేలిక (4-4.9లోపు), ఓ మోస్తరు (5-5.9లోపు), బలమైన (6-6.9లోపు), తీవ్రమైన (7-7.9లోపు), భారీ (8పైన) ప్రకంపనలు వచ్చే అవకాశముంది.

 

 

ఢిల్లీలో 1720లో 6.5 తీవ్రతతో బలమైన భూకంపం వచ్చింది. 1803లో మథురలో 6.8%, 1842లో మథురకు సమీపంలో 5.5, 1956లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 6.7, 1960లో దిల్లీకి ఆనుకొని ఉండే ఫరీదాబాద్‌లో 6, 1966లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ సమీపంలో 5.8 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.

 

 

ఢిల్లీ-ఎన్సీఆర్‌ నుంచి హిమాలయాల మధ్యలో కూడా చాలాసార్లు వచ్చాయి. 1905లో కంగ్రా (7.8), 1934లో బిహార్‌-నేపాల్‌ (8), 1950లో అసోం (8.6), 2005లో ముజఫరాబాద్‌ (6.7), 2015లో నేపాల్‌ (7.8)లో భారీ భూకంపాలు సంభవించాయి. ఇండియన్‌ ప్లేట్‌ నుంచి హిమాలయన్‌ భూ ఊపరితలం కింద ఉన్న రాతిపొరలు జారిపోవడమే ఇందుకు కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: