దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75 వ జయంతి వేడుకలను ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహ‌న్‌ రెడ్డి తూతూమంత్రంగా నిర్వహించారు. సొంత తండ్రి జయంతి వేడుకలను నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ జగన్ రెడ్డిని.. షర్మిల ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. ఎన్నికల సమయంలో ఒక్కో సిద్దం సభకు రూ.30 నుంచి రూ.40 కోట్లు ఖర్చు చేసిన వైసీపీ.. గత ఐదేళ్లు వైఎస్ఆర్ పేరు వాడుకున్నా.. వైసీపీ ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ 75 వ జయంతి రోజు ఒక్క సభ కూడా నిర్వహించలేదని.. వైసీపీ అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అదే టైంలో షర్మిల మాత్రం మంగళగిరి వేదికగా వైఎస్ఆర్ 75 వ జయంతి కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయడంతో పాటు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు.. తెలంగాణ, కర్ణాటక , జాతీయ‌ స్థాయికి చెందిన పలువురు కాంగ్రెస్ కీలక నేతలను ఆహ్వానించి సత్తా చాటారు. ఇక రాజకీయంగా తన సొంత అన్న జగన్‌ను టార్గెట్ చేసే విషయంలో తాను ఎంత మాత్రం వెనక్కు తగ్గను అంటూ కొద్ది రోజులుగా షర్మిల సంకేతాలు పంపుతూ వస్తున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా జగన్‌ను టార్గెట్ చేస్తూ ప్రజల అటెన్షన్ తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ రాజకీయ వారసురాలిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేలా జగన్ పై విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.


వైఎస్ఆర్ కు జగన్ రాజకీయ వారసుడు కాదని.. తాను మాత్రమే రాజకీయ వారసరాలిని అని.. షర్మిల పదేపదే చెబుతున్నారు కూడా. వైయస్ పేరును వైసీపీ జగన్ భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా చేయటమే ధ్యేయంగా షర్మిల వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిలపై ఇప్పుడు జగన్ ఎలాంటి బాణం వదులుతారన్నది వైసీపీ వాళ్లకే అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా షర్మిల మాత్రం జగన్‌ను బాగా డ్యామేజ్ చేస్తుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: