తాజాగా మీడియా క‌థ‌నాల‌ ప్రకారం, వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జైలు శిక్షను ఎదుర్కొంటే పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి భారతి చేపట్టే పరిస్థితి రావచ్చని చర్చలు సాగుతున్నాయి. ఈ కథనం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నిజంగా అలాంటి పరిస్థితి వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, భారతి రాజకీయ రంగంలోకి వస్తే ఆమెకు ఆ సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉందా అనే ప్రశ్న మాత్రం ప్రధానంగా మారింది. వైఎస్ కుటుంబం నుంచి మహిళలు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల రాజకీయాల్లో అడుగుపెట్టినా, ఆశించిన స్థాయిలో వారు నిలబడలేకపోయారు. విజయమ్మ చివరికి రాజకీయాలనుంచి దూరమయ్యారు. షర్మిల కొత్త పార్టీ పెట్టి విఫలమై, ప్రస్తుతం జాతీయ పార్టీని నడిపిస్తున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.


ఈ నేపథ్యంలో భారతి అడుగుపెడితే, ఆమెకు ముందున్న పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి బలహీనంగా ఉంది. కూటమి బలంగా ఉన్నా, వైసీపీ క్షేత్రస్థాయిలో బలాన్ని కోల్పోయింది. కేసుల ముప్పు పార్టీ నాయకత్వాన్ని వేధిస్తోంది. పార్టీకి ఒకప్పుడు కట్టుబడి పనిచేసిన కార్యకర్తల శాతం గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీని ఏకతాటిపై నడిపించడం, భిన్న మనస్తత్వాలున్న నాయకులను కాపాడుకోవడం భారతి ముందు ఉన్న ప్రధాన సవాళ్లుగా నిలుస్తాయి. రాజకీయాల్లో ఇప్పుడు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్న నాయకులే నిలబడగలుగుతున్నారు. కానీ, సౌమ్యురాలిగా పేరున్న భారతి ఆ రీతిలో తట్టుకుని ముందుకు సాగగలరా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో మహిళా నాయకత్వాన్ని పెద్దగా అంగీకరించరని వాస్తవం ఉంది. అలాంటప్పుడు భారతి నాయకత్వాన్ని ఒప్పించుకోవడం సులభం కాదు.


ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవాలంటే ఆమె కూడా పాదయాత్రలు, బలమైన ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి దిశగా వెళ్లే ధైర్యం, శక్తి ఆమెకు ఉందా అన్న ప్రశ్న మరింత కీలకం. మొత్తంగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతి రాజకీయాల్లోకి వస్తే, పార్టీని ముందుకు నడిపించడం చాలా కష్టమైన పరీక్ష అవుతుంది. మిగతా కాలమే ఈ ఊహాగానాలకు సమాధానం చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: