ఏపీ రాజకీయాల్లో ముఖ్య ప్రతిపక్షం అయిన వైసీపీ ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా పరిశీలనా విధానానికే పరిమితమైపోయిందన్న విమర్శలు జోరులో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార కూటమి పార్టీల కదలికలను గమనించడం తప్ప .. సొంతంగా ఏదైనా స్పష్టమైన కార్యక్రమం చేపట్టడంలో వైసీపీ వెనుక ప‌డిపోతోంద‌న్న అభిప్రాయం జ‌నాల్లో స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ప్రభుత్వం, మంత్రివర్గం, పరిపాలనా వ్యవహారాల్లో చిన్నపాటి వివాదాలైనా వచ్చినా వాటిని రాజకీయం చేయడానికే ప్రాధాన్యత ఇస్తోందన్న మాటలు వస్తున్నాయి. కానీ ఇదే సమయంలో కూటమి పార్టీలు తమ తమ విధానాలు, శాఖలు, కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటం వైసీపీకి పెద్ద దెబ్బగా మారుతోంది.


వైసీపీ ఎక్కువగా డిఫెన్స్‌లో ప‌డిన ప్రధాన కారణాల్లో ఒకటి జనసేన పార్టీ దూకుడు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ప్రతి అడుగుపై వైసీపీ అతి ఆసక్తిగా దృష్టి పెట్టుతోంది. జనసేన ప్రస్తుతానికి గిరిజన ప్రాంతాల్లో బలంగా విస్తరిస్తుండటం వైసీపీకి అత్యంత ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు గిరిజన ఓటు బ్యాంక్ వైసీపీతోనే ఉంది. పార్టీ గెలిచినా ఓడినా అక్కడ జగన్‌కు మంచి ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమీకరణాలు మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


గిరిజన ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జనసేన ఆధిపత్యం పెరగడం వైసీపీకి మరింత కఠిన పరిస్థితిని సృష్టిస్తోంది. గ్రామాల్లో ఇప్పటి వరకు టీడీపీ - వైసీపీ ఆధిపత్యమే ఉన్నా, ఇప్పుడు జనసేన కూడా వ్యూహాత్మకంగా బలపడుతోంది. గ్రామీణ ఓటు బ్యాంక్‌ను తన వైపు తిప్పుకోడానికి ఆ పార్టీ చేసే ప్రయత్నాలు వైసీపీకి ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్టీ అంతర్గతంగా కూడా “ జనసేన గ్రామాల్లో నిలదొక్కుకునే దశ దరిదాపుల్లోనే ఉంది ” అన్న చర్చ జరుగుతోంది.


అయినా వైసీపీ శ్రేణుల్లో పెద్దగా కదలిక కనిపించకపోవడం, పార్టీ ఏదైనా ప్రత్యామ్నాయ వ్యూహరచన చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రాజకీయాల్లో “ చేస్తూ ఉంటే ముందుకు సాగుతాం… చూస్తూ ఉంటే అలాగే ఉండిపోతాం ” అనే సామెతకు వైసీపీ ఈ దశలో ప్రత్యక్ష ఉదాహరణలా మారింది. కూటమి పార్టీలు, ముఖ్యంగా జనసేన, అడుగు ముందుకు వేస్తున్నప్పుడు వైసీపీ మాత్రం అదే స్థితిలో నిలబడిపోవడం ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: