లోకనాయకుడు కమల్ హాసన్ ఆసక్తికర సినిమాలతో తన అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. అదేంటంటే కమల్ హాసన్ ఒక మలయాళం సినిమా కోసం మళ్ళీ రచయిత గా మారుతున్నారు.

మలయాళం దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాకి కమల్ హాసన్ స్క్రిప్టు అందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయానా కమల్ హాసనే ప్రకటించడం విశేషం. కథ అందించడం మాత్రమే కాదు ఈ సినిమాలో కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. 1992లో తేవర్ మగన్ (తెలుగులో క్షత్రియ పుత్రుడు) గా వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ "గాడ్ ఫాదర్" సినిమా ఆధారంగా వచ్చిన చిత్రమే.. తేవర్ మగన్! దీనికి కమల్ హాసనే కథ అందించడం గమనార్హం.

అయితే తేవర్ మగన్ చిత్రానికి కొనసాగింపుగా సీక్వెల్ చేయడానికి మహేష్ నారాయణన్ సిద్ధమయ్యారు. దీంతో ఆ చిత్రానికి కూడా స్క్రిప్ట్ అందించేందుకు కమల్ హాసన్ మళ్లీ రచయితగా మారుతున్నారు. నిజానికి కమల్ తాను నటించిన.. డైరెక్ట్ చేసిన చాలా సినిమాలకు స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ అందించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వైవిధ్యభరితమైన సినిమాలకు కథ అందిస్తూ.. నటిస్తూ.. దర్శకత్వం వహిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన వెలుగొందుతున్నారు.

ఇకపోతే జాతీయ అవార్డు గ్రహీత ఫాహద్‌ ఫాజిల్‌ తేవర్ మగన్ సీక్వెల్ లో నటించనున్నారని సమాచారం. టేకాఫ్, సీయూ సూన్, మాలిక్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఈసారి ఏకంగా కమల్ హాసన్ తో కలిసి సినిమా చేసే అవకాశాన్ని పట్టేశారు. కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రం కూడా చేస్తున్నారు. ఈసారి ఆయన కచ్చితంగా బాహుబలి లాంటి హిట్ కొడతారని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: