
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ టైటిల్ రోల్లో తెరకెక్కిన యాక్షన్ మసాలా చిత్రమే `శివాజీ`. ది బాస్ అనేది సబ్ టైటిల్. శ్రియ శరన్ హీరోయిన్గా యాక్ట్ చేయగా.. సీనియర్ స్టార్ హీరో ఈ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ వంటి నటులను పరిశీలించిన తర్వాత ఆదిశేషన్ పాత్రకు సుమన్ ను ఎంపిక చేశారు శంకర్. వివేక్, రఘువరన్, మణివణ్ణన్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో మెరిశారు.
అప్పట్లోనే దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో ఎంఎస్ గుహన్, ఎం. శరవణన్ కలిసి నిర్మించిన శివాజీ మూవీ 2007 జూన్ 15న విడుదలై తొలి ఆట నుంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, రజనీకాంత్ యాక్టింగ్, శంకర్ మేకింగ్, శ్రియా గ్లామర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, సాంగ్స్ సినిమాను ఓ రేంజ్లో లేపాయి. ముఖ్యంగా `బాస్.. గుండు బాస్` అంటూ రజనీ చెప్పే డైలాగ్ అటు ఫ్యాన్స్, ఇటు ఆడియెన్స్కు పిచ్చెక్కించింది.
టాక్ అనుకూలంగా ఉండటంతో శివాజీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో రూ. 18 కోట్లకు పైగా షేర్, రూ. 27.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించి దుమ్ము దులిపేసింది. తమిళంలో రూ. 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 76 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 151 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కోలీవుడ్ చరిత్రలో 100 కోట్ల క్లబ్లోకి ప్రవేశించిన మొదటి తమిళ చిత్రంగా, ఇండియాలోనే రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూల్ చేసిన తొలి సినిమాగా శివాజీ అరుదైన రికార్డులు నెలకొల్పింది. అలాగే డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ఇండియన్ ఫిల్మ్ శివాజీనే. అదేవిధంగా రిలీజ్ తర్వాత శివాజీ ఒక జాతీయ అవార్డ్, మూడు సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, రెండు విజయ్ అవార్డ్స్ మరియు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డ్ గెలుచుకుంది.