తెలుగు తెరపై విభిన్నతను కోరుకునే ప్రేక్షకులకు ఇప్పుడు ఓ సినిమా చక్కటి భక్తి – యాక్షన్ – విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. ఆ సినిమా పేరు ‘మహావతార్ నరసింహ’. ఎలాంటి హైప్ లేకుండా సైలెంట్‌గా జూలై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టిస్తోంది. స్టార్ హీరోలూ లేరు, గ్లామర్ డోసులూ లేరు.. అయినా థియేటర్లు పౌరాణికతతో నిండిపోతున్నాయి. హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు అశ్విన్ కుమార్ వజ్రం లాంటి స్క్రిప్ట్‌తో తీసిన ఈ సినిమా, భక్త ప్రహ్లాదుడి కథ ఆధారంగా రూపొందించబడింది. అయితే ఇది కేవలం ఒక సినిమా కాదు – మహావతార్ యూనివర్స్ కు ఇది ఆరంభం మాత్రమే.


ఈ యూనివర్స్‌లో విష్ణువు దశావతారాల ఆధారంగా ఒక పౌరాణిక ప్రాజెక్ట్ లైన్ అప్ సిద్ధమైంది. మేకర్స్ ప్రకారం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒక అవతారం ఆధారితంగా సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో నరసింహ, పరశురాముడు, వామనుడు, శ్రీరాముడు, కృష్ణుడు, కల్కి వంటి అవతారాలు వరుసగా రానున్నాయి. అంటే 2037 వరకు విశ్వవిఖ్యాతమైన డివైన్ సిరీస్ చూచేందుకు సిద్ధం కావాల్సిందే! ఇక ‘మహావతార్ నరసింహ’ విషయానికి వస్తే – ఇది కేవలం ఒక యానిమేషన్ ఫిల్మ్ మాత్రమే కాదు, ఇది ఒక డివోషనల్ విజువల్ వండర్. 2D, 3D ఫార్మాట్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ మూవీ చిన్నారులతో పాటు పెద్దవారికి కూడా ఒక వినూత్న అనుభూతిని ఇస్తోంది. సినిమా ప్రారంభమైన నిమిషం నుంచి ప్రేక్షకులు కథలో లీనమైపోతున్నారు. సినిమా IMDBలో 9.8 రేటింగ్ సాధించడం సాధారణ విషయం కాదు – ఇది తెలుగు సినిమా గర్వించదగిన ఘనత.



కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఓపెనింగ్ డేనే రూ.2.01 కోట్లు ఇండియాలో, రూ.2.29 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి, మరోసారి కంటెంట్ ఆధారంగా విజయం సాధించవచ్చని నిరూపించింది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ల కోసం థియేటర్ల వద్ద భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా పిల్లలతో పాటు కుటుంబాలు కూడా ఈ సినిమాను వీక్షించేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నాయి. సినిమాలో దేవతల పాత్రలు, డెవిల్స్ డిజైన్, నరసింహ అవతార ప్రదర్శన – అన్నీ ఆధ్యాత్మికతకు టెక్నాలజీ తాకిడి లా ఫీల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: