కరోనా వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారీ మార్పు వచ్చింది. థియేటర్లకు బదులు ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లే ప్రజలకు ప్రధాన వినోద వేదికలయ్యాయి. వెబ్ సిరీస్ కల్చర్ ఒక్కసారిగా ఉధృతమైపోయింది. కానీ, ఈ విప్లవానికి మరో దుష్ప్రభావం కూడా ఉంది. క్రైమ్, సైకో కిల్లర్ కథలు, హారర్, వయొలెన్స్ — ఇవన్నీ గత నాలుగేళ్లుగా బోలెడన్ని సిరీస్‌లలో పునరావృతమవుతూనే ఉన్నాయి. సెన్సార్ లేకపోవడంతో అతి బోల్డ్, అతి క్రూరం, అతి వల్గర్ కంటెంట్ వీటిలో ఊహించని స్థాయిలో చేరింది. ఈ విషయం మళ్లీ చర్చకు రావడానికి కారణం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన దారుణం. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు, ఒక చిన్న పాపను కత్తితో హత్య చేశాడు.


 “ఇంత హింస ఎలా నేర్చుకున్నావు?” అని పోలీసులు అడగగా – ఓటిటిలో చూసిన క్రైమ్ సిరీస్‌ల వల్లే తానిది చేసినట్లు చెప్పాడట. ఈ సమాధానం సమాజాన్నే షాక్‌కి గురి చేసింది. పెద్దవాళ్లు తప్పిపోయినా ఓకే కానీ, చిన్న పిల్లలే ఇలాంటివి చేయడం భయంకరమైన పరిణామం. వాస్తవానికి ఓటీటీలలో స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్ వంటి మంచి కంటెంట్ వస్తే ఎటువంటి సమస్య లేదు. కానీ, మీర్జాపూర్, అసుర్, లస్ట్ స్టోరీస్ తరహా ప్రాజెక్టులు మాత్రం ఎక్కువగా బూతులు, రక్తపాతం, కత్తులు, తుపాకులు చూపించేస్తూ మైండ్‌సెట్‌నే వక్రీకరిస్తున్నాయి. హత్యలను సహజత్వం పేరుతో మరీ క్రూరంగా చూపించడం – ఇది ఇప్పుడు డైరెక్టర్లు చేస్తున్న అతిపెద్ద తప్పిదం. వాళ్లకు డబ్బు, వ్యూస్ వస్తున్నాయి కానీ సమాజంపై పడే ప్రభావం గురించి మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు.



ఇప్పుడున్న పరిస్థితి ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అంటే – ఈ ప్రభావం ఇంకా కాస్త చిన్న స్థాయిలోనే ఉన్నా, అదే కొనసాగితే భవిష్యత్తులో యూత్, టీనేజ్ మైండ్‌సెట్‌ను మామూలు దారి తప్పించడం కాదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. తల్లిదండ్రులు ఇప్పుడు ఇప్పటికే భయంతో వణికిపోతున్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదకరమవుతుంది. కాబట్టి, ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఓటీటీలపై సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వెబ్ సిరీస్ పేరుతో విచ్చలవిడిగా వస్తున్న హింస, బూతులకు ఒక పరిమితి విధించడం తప్పనిసరి. లేదంటే, ఇంకా ఎన్నో అమాయక ప్రాణాలు బలి కావాల్సిందే. వినోదం కావాలి – కానీ అది మానవత్వాన్ని మింగేస్తే మాత్రం అనర్థమే!

మరింత సమాచారం తెలుసుకోండి: