టాలీవుడ్‌లో ఇప్పుడు అత్యంత ప్రతిభావంతులున్న కుటుంబం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళి కుటుంబమే! రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచనా పటిమ, సోదరుడు కీరవాణి సంగీత సంచలనాలు, సతీమణి రమ స్టైలింగ్ మ్యాజిక్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఈ కుటుంబంలో ఉన్న మరో గొప్ప ప్రతిభావంతుడు.. రాజమౌళి సోదరుడు ఎస్.ఎస్. కాంచికి మాత్రం ఇంతకాలం తగినంత గుర్తింపు దక్కలేదనే చెప్పాలి!


'అమృతం' సీరియల్‌తో కాంచి బాగా ఫేమస్ అయినా.. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు. రచయిత, దర్శకుడు కూడా! 'మర్యాద రామన్న' చిత్రానికి కథ అందించడంతో పాటు, రాజమౌళి తీసిన మరికొన్ని సినిమాలకు ఆయన రచనా సహకారం అందించారు. దర్శకుడిగా 'షో టైం' అనే సినిమాను తెరకెత్తించినా.. అది కొన్ని కారణాల వల్ల ప్రేక్షకులను పలకరించలేకపోయింది. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. కాంచికి రావాల్సినంత పేరు, స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు.



అయితే, ఇప్పుడు ఆ అదృష్టం కాంచి తలుపు తట్టబోతోంది! సినీ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం.. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రాబోతున్న వార‌ణాసి కి కాంచి కీలక రచయితగా పనిచేయడం సంచలనం! సాధారణంగా రాజమౌళి సినిమాలకు కథకుడిగా విజయేంద్ర ప్రసాద్ పేరు మాత్రమే పడుతుంది. వేరే రచయితల సహకారం తీసుకున్నా.. మేజర్ కంట్రిబ్యూషన్ విజేంద్ర ప్రసాద్‌దే ఉంటుంది కాబట్టి, ఆయనకే పూర్తి క్రెడిట్ ఇస్తారు. కానీ, ఈసారి రాజమౌళి మాత్రం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు!



తాజాగా విడుదలైన 'వార‌ణాసి' వీడియో గ్లింప్స్‌లో విజయేంద్ర ప్రసాద్ పేరు పక్కనే ఎస్.ఎస్. కాంచి పేరును కూడా ప్రముఖంగా వేశారు. ఈసారి టైటిల్ క్రెడిట్స్‌లో ఇద్దరికీ కలిపి స్టోరీ క్రెడిట్ ఇవ్వబోతున్నారు. దీనికి ప్రధాన కారణం.. కాంచికి పురాణాల మీద ఉన్న గొప్ప పట్టు! ఆ అపార జ్ఞానంతోనే ఆయన విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి 'వార‌ణాసి' లాంటి సెన్సేషనల్ కథను వండారు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ, అందుకు తగ్గ గుర్తింపు దక్కని కాంచికి.. ఈ పాన్ వరల్డ్ స్థాయి సినిమా 'వార‌ణాసి' ఒక మెగా బ్రేక్ ఇచ్చి, ఆయన పేరును చరిత్రలో నిలపడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: