ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న పటాస్ షో లో జగన్ గెలుపు అవమానిస్తూ ఓ కమెడియన్ కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ వివాదంపై పటాస్ యాంకర్ రవి స్పందించారు . తనను విమర్శిస్తూ జగన్ అభిమానులు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించడంతో యాంకర్ రవి తన వాదనను వీడియో ద్వారా విడుదల చేశారు.
పటాస్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ జగన్ అభిమానులు కానీ బాధపడి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నానని రవి అన్నారు. జగన్ గెలుపుపై ఓ కమెడియన్ చేసిన వ్యాఖ్యలను తాను మెచ్చుకున్నాను అన్న వాదన సరికాదని రవి అన్నారు. ప్రోగ్రాం యాంకర్ గా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం తన బాధ్యత అన్నారు.
ఏపీ సీఎం జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని రవి చెప్పుకొచ్చారు. త్వరలో తాను జగన్ ను కలవబోతున్నానని కూడా రవి ఆ వీడియోలో వివరించారు. ఈ మేరకు ఇప్పటికే జగన్ కుటుంబ సభ్యులతో తాను మాట్లాడాను అని వివరించారు.
జగన్ అభిమానులు తన ఫోన్ నెంబర్ ని సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ చేస్తున్నారని .. వాస్తవానికి అది తన అసిస్టెంట్ ఫోన్ నెంబర్ అని యాంకర్ రవి చెప్పారు. తన అసిస్టెంట్ ఫోన్ నెంబర్ కు విపరీతంగా కాల్స్ వస్తున్నాయని.. దయచేసి కాల్స్ చేసి విసిగించవద్దని వైసిపి అభిమానులకు విజ్ఞప్తి చేశారు యాంకర్ రవి.