2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి సానుభూతి అస్త్రం పనిచేసింది. అందుకే ఆ ఎన్నికల్లో వైసీపీ రెండు సీట్లు మినహా అన్ని చోట్లా విజయం సాధించింది. 2014లో జగన్ సొంత వ్యూహాలతోనే ఎన్నికల బరిలోకి దిగినా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు అయితేనే సమర్థుడు అని ప్రజలు భావించి ఆయనకు అధికారం కట్టబెట్టారు.
ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోయినా నాడు టీడీపీ - వైఎస్సార్ సీపీ మధ్య కేవలం 5 లక్షల ఓట్లే తేడా. ఇక గత ఎన్నికల్లో జగన్ అనేక ఈక్వేషన్లు పాటించి టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారు. అయితే ఇప్పుడు మూడేళ్లకే జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా జగన్కే లాభం ఉంటుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. జమిలీ జరిగితే జగన్కు... ఎన్టీఆర్కు లింక్ పెట్టి చూడాల్సిన పరిస్థితి వస్తోంది. అప్పట్లో అంటే 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీయార్ కేవలం ఏడాదిన్నరకే వెన్నుపోటు దెబ్బతో సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 1985లో రెండో సారి అంతకు మించిన సీట్లతో అధికారంలోకి వచ్చారు.
ఇప్పుడు జగన్ కు కూడా ఖచ్చితంగా ఇదే సానుభూతి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జగన్కు ఏపీ జనాలు ఐదేళ్లు పాలించమని తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. మూడేళ్లకే ఎన్నికలు వస్తే మరోసారి జగన్కు నాడు 1985లో ఎన్టీఆర్ కు ఎలా బ్రహ్మర్థం పట్టారో ఇప్పుడు కూడా అంతే ఘన విజయం కట్టబెడతారా ? అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.