పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో ఊహించని మలుపు. తాజాగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయాజ్ అహ్మద్ అనే ఓ 28 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను సోనమార్గ్ లోని థాజివాస్ గ్లేసియర్ వద్ద మ్యూల్ సర్వీస్ ప్రొవైడర్ గా పనిచేస్తాడు. ఓ మహిళా టూరిస్ట్ చేసిన షాకింగ్ ఫిర్యాదుతో పాటు, ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో, ఫొటో ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేశారు.

ఆ మ్యూల్ రైడ్ సమయంలో అతను వింతైన, వ్యక్తిగత మతపరమైన ప్రశ్నలు అడిగాడని ఆ టూరిస్ట్ ఆరోపించింది. ఈ వీడియో త్వరగా వైరల్ కావడంతో, గందర్‌బల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అయాజ్ అహ్మద్ స్వస్థలం గందర్‌బల్ జిల్లాలోని గోహిపోరా గ్రామం. వీడియో బయటకొచ్చిన వెంటనే పోలీసులు వేగంగా కదిలారు. ఇతన్ని త్వరగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని గట్టిగా విచారిస్తున్నారు, కేసు నమోదు చేసి అధికారిక ప్రక్రియ మొదలుపెట్టారు.

అయాజ్ అహ్మద్ దొరకడానికి ఆ మహిళా టూరిస్ట్ ఫిర్యాదే ప్రధాన కారణం. ఈ షాకింగ్ ఘటన ఏప్రిల్ 20న జరిగింది, అంటే పహల్గామ్ ఉగ్రదాడికి సరిగ్గా ఒకరోజు ముందు. ఆమె బైసరన్ వ్యాలీలో ఎంజాయ్ చేయడానికి వెళ్లి, అక్కడ మ్యూల్ రైడ్ బుక్ చేసుకుంది. కానీ ఆమె ఊహించని విధంగా, రైడ్ ఇచ్చిన వ్యక్తి ఆమెను మతానికి సంబంధించిన చాలా విచిత్రమైన, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఆమె మతం ఏంటి, గుడికి వెళ్తుందా, స్నేహితులు ఎవరు, వాళ్ల మతమేంటి ఇలాంటి ప్రశ్నలు అడిగాడని ఆమె తెలిపింది.

తర్వాత, ఆ టూరిస్ట్ తన ఫోన్‌లో ఉన్న ఆ వ్యక్తి ఫొటోను పోలీసులకు చూపించింది. అతను మెరూన్ కలర్ జాకెట్, పైజామా టైప్ ప్యాంటు వేసుకున్నట్లు ఆ ఫొటోలో ఉంది. అంతేకాదు, తన స్నేహితులతో చాట్ చేసిన వాట్సాప్ గ్రూప్ స్క్రీన్‌షాట్‌లను కూడా ఆమె షేర్ చేసింది. ఆ స్క్రీన్‌షాట్‌ల ఆధారంగా ఆమె స్నేహితులు కూడా ఆ వ్యక్తిని గుర్తించి, ఇతనే అని నిర్ధారించారు.

ఈ కీలక సమాచారం అంతా అందుకున్న వెంటనే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అయాజ్ అహ్మద్ ను త్వరగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో భాగంగా ఇతన్ని లోతుగా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: