
భారత్-పాకిస్థానే కాదు, ప్రపంచంలో శక్తివంతమైన అమెరికా, రష్యా, యూరప్ దేశాలు కూడా పెద్ద గొడవ దిశగా వెళ్తున్నాయని.. అంతిమంగా ఒక భయంకరమైన యుద్ధం రాబోతుందని.. అదే మూడో ప్రపంచ యుద్ధమని అంటున్నారు. ప్రపంచ యుద్ధం అంటే ఆషామాషీ కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో నాలుగు కోట్ల మంది పౌరులు, సైనికులు మృత్యువాత పడగా.. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 6 కోట్ల మంది ప్రాణాలు విడిచారు. యుద్ధం వల్ల వచ్చే కరువు, అనారోగ్యాలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. అది కచ్చితంగా అణుయుద్దంగానే మారుతుంది. ఎందుకంటే, పెద్ద దేశాల యుద్ధ సామార్థ్యం మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే చాలా ఎక్కువ. చాలా దేశాల వద్ద కావాల్సినంత అణుశక్తి ఉంది. దాన్ని ఉపయోగిస్తే ప్రకృతి కోలుకోలేని దెబ్బతింటుంది. జీవి మనుగడ ప్రమాదంలో పడుతుంది.
YouGov అనే అంతర్జాతీయ సంస్థ చేసిన తాజా సర్వేలో మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం.. వచ్చే పదేళ్లలో మూడో ప్రపంచ యుద్ధం రావచ్చని లేదా వచ్చే అవకాశం ఉందని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో 41శాతం నుంచి 55శాతం మంది నమ్ముతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో 45శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. 1939-45లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం కంటే భయకరంగా మూడో ప్రపంచం ఉండనుందని.. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగా ఉండనుందని సర్వే చెబుతోంది. ప్రతి నలుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
అలాగే ఇటలీ నుంచి యూకే వరకు చాలా మంది యుద్ధం వస్తే తమ దేశం అందులో తప్పకుండా పాల్గొంటుంది.. కానీ తమ సైన్యాల మీద మాత్రం అంత నమ్మకం లేదని చెప్పడం గమనార్హం. అమెరికన్లు మాత్రం తమ సైన్యంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. యూరప్, అమెరికాలో అధిక శాతం మంది మూడో ప్రపంచ యుద్ధానికి రష్యానే ప్రధాన కారణం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యూరప్లోని చాలామంది అమెరికాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో పెరుగుతున్న టెన్షన్లు యూరప్లో శాంతికి ముప్పని ఆ దేశీయులు భావిస్తున్నారు.
అమెరికాలో 52శాతం మంది తమ దేశంలో మళ్లీ నాజీ జర్మనీలో జరిగిన లాంటి నేరాలు జరగవచ్చని భయపడుతున్నాడు. స్పెయిన్లో 31శాతం, జర్మనీలో 50శాతం మంది మరియు ఇతర యూరోపియన్ దేశాల్లో 59శాతం మంది కూడా నాజీల లాంటి నేరాలు యూరప్లో జరగొచ్చని ఆందోళన చెందారు. ఇక చాలా దేశాల్లో 40శాతం నుంచి 52శాతం మంది రెండో ప్రపంచ యుద్ధం గెలవడంలో అమెరికానే ముఖ్యపాత్ర పోషించిందని చెబితే.. 17శాతం నుంచి 28శాతం మంది సోవియట్ యూనియన్కు ఆ ఘనతను ఇచ్చారు. మొత్తంగా అంతర్జాతీయ సంస్థ తాజా సర్వే ప్రకారం.. భారత్-పాక్ మధ్య అల్లర్లు, అమెరికా-రష్యా మధ్య వైరం, యూరప్లో నెలకొన్న భయాలు నడుమ మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఎవరూ ఊహించలేనంత ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రపంచం పడుతుందన్న విషయం స్పష్టమైంది.