రాజకీయాలలో ఓర్పు, దూరదృష్టి అత్యంత కీలకం. అధికారంలో లేనప్పుడు పార్టీకి తగిన విధంగా స్పందించటం, ప్రత్యర్థులు వేసే వలలకు చిక్కకుండా ముందుకు సాగటం రాజకీయ నాయకుల చాతుర్యానికి సూచకం. కానీ ప్రస్తుతం ఆ అవసరాన్ని వైసీపీ నేతలు గ్రహించలెకపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడైతే అధికార పగ్గాలు చేజారిపోతాయో, అప్పుడే మూడ్ మారుతుంది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు కూడా టీడీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. అదే మాదిరిగా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే, వారు కూడా వైసీపీని నిశితంగా టార్గెట్ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కనిపించే రాజకీయ ధోరణే అయినప్పటికీ, ప్రతిపక్షంగా ఉన్నవారు స్పందించే తీరు చాలా బాధ్యతతో ఉండాల్సి ఉంటుంది. అదే వైసీపీ లోపిస్తున్న ప్రధాన అంశం అని చెప్పాలి.


ఇటీవల వైసీపీ నేతల భాష, విధానం చూసినట్లయితే.. పార్టీ పరాజయం ఇచ్చిన ఫ్రస్ట్రేషన్‌ను వారు మాటల ద్వారా బయటపెడుతున్నట్టే ఉంది. "రప్పా రప్పా నరికేస్తాం" వంటి వ్యాఖ్యలు రాజకీయాలకు కాకుండా, ప్రజల నమ్మకానికి దెబ్బ తీయగలవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజలలో పార్టీపై ఉన్న అభిప్రాయాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు శోభించవు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇటీవల ఆయన సినిమాల్లోని డైలాగులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమాల్లో వినడానికి బాగుండే డైలాగులు, నేరుగా రాజకీయ వేదికలపై వినిపిస్తే ప్రజలకు హుందాతనంగా అనిపించవు. ప్రజలు రాజకీయ నాయకులనుంచి బాధ్యతాయుతమైన ప్రవర్తనను ఆశిస్తారు.



ఈ నేపథ్యంలో జగన్, వైసీపీ భవిష్యత్‌ రాజకీయాలకు సరైన దిశను ఎంచుకోవాలంటే మాటలు, చర్యలు అన్నీ సమతౌల్యంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నుంచి ప్రజలు మంచి పాత్రకే ఆశ పెడతారు. కేవలం అధికార పార్టీ విమర్శించడమే కాకుండా, ప్రజాసంబంధమైన సమస్యలపై పోరాటం చేయడం వల్లే ఆయనకు తిరిగి విశ్వసనీయత లభించవచ్చు. మొత్తానికి, వైసీపీ ఈ దశలో ప్రతిపక్షంలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలి. ప్రత్యర్థుల వలలకు బలయ్యే మాటలు కాకుండా, ప్రజల మనసును గెలిచే చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే – ప్రజల్లో చులకన పెరిగి, పార్టీ పునర్నిర్మాణ ప్రయాణం మరింత కష్టతరం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: